థర్డ్ ఫ్రంటే: ఈటెల, మోడీని పవన్ ప్రశ్నిస్తారా అని ప్రశ్న
హైదరాబాద్: తన అన్నయ్య చిరంజీవిని ప్రశ్నించలేని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తారా అని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రశ్నించారు. శనివారం తెరాస నాయకులు ఈటెల రాజేందర్, నోముల నర్సింహయ్యలు విలేకరులతో మాట్లాడారు.
కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందన్నారు. థర్డ్ ఫ్రంట్కే తమ మద్దతు అని చెప్పారు. దేశంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు. తెరాస సెక్యులర్ పార్టీ అని, కేంద్రంలో సెక్యులర్ పార్టీకే మద్దతు తెలుపుతామన్నారు. థర్డ్ ఫ్రంట్లో సిపిఎం, టిఎంసిలు ఉన్నా తమకు అభ్యంతరం లేదన్నారు. అన్నను ఎదిరించలేని పవన్.. మోడీని ప్రశ్నించగలరా అని నోముల అన్నారు. కెసిఆర్ సిఎం అయితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
65 సీట్లు మావే: దానం
రానున్న సార్వత్రిక ఎన్నికలలో 65 స్థానాల్లో గెలుపు తమదేనని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 స్థానాలు తమవే అన్నారు. గెలుపుపై ఇతర పార్టీల ప్రకటనలు వరకే పరిమితమన్నారు. కాంగ్రెసు పార్టీ వెనుకపడిందన్నది అవాస్తవమన్నారు. దానం శనివారం టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను కలిసిన సందర్భంగా మాట్లాడారు.
పొన్నాల మాట్లాడుతూ... తెరాస మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. కాంగ్రెసు పార్టీ గెలుపుపై ఎలాంటి సందేహం లేదన్నారు. సొంత అభ్యర్థులు లేని తెరాస గెలుస్తుందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపు ఖాయమైందన్నారు.