చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన తల్లికి వందనం పథకం పైన వైసిపి నేతల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు కావు సూపర్ మోసాలు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
అమ్మ ఒడి పథకం అపహాస్యం పాలైంది
గత ప్రభుత్వం పిల్లలను బడికి పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదు అన్న సదుద్దేశంతో ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టిడిపి సర్కార్ అపహాస్యం చేస్తుందని, తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రజలకు మేలు చేస్తే, చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

మాట తప్పిన చంద్రబాబు
అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టిన తెలుగుదేశం పార్టీ పేరు మార్చి తల్లికి వందనం పేరుతో పథకాన్ని ఇస్తామని చెప్పినా, అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ ఇంట్లో కేవలం ఒకరికే 15000 ఇస్తున్నారని, తమను అధికారంలోకి తీసుకొస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు.
ఎన్నికల సమయంలో చెప్పిందేంటి
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సందర్భంగా అమ్మ ఒడి పథకానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు చేసిన వ్యాఖ్యలను వీడియోలుగా ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి జారీ చేసిన జీవో 29 ని చదివితే చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.
పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పు
ఆ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద 15000 రూపాయలు అందిస్తామని ఉందని, ఎంతమంది పిల్లలను స్కూలుకు పంపించినా ఒక కుటుంబానికి వచ్చేది 15000 మాత్రమేనని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి మోసం అంటూ నిప్పులు చెరిగారు. ఈ మోసం పైన పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు మోసం చేస్తున్నారు
జగన్ ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు అయితే, చంద్రబాబు ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్టం అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్న పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వమే ఉంటే ఈపాటికి తల్లుల ఖాతాలలో డబ్బులు పడేవని, ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పడం లేదన్నారు.
మళ్ళీ జగన్ సీఎం అయ్యుంటే బాగుండేది అన్న ఆలోచనలో ప్రజలు
ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్లే వాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకు ఖచ్చితంగా ఒక్కొక్కరికి 15000 రూపాయలు చొప్పున వేసి తీరాల్సిందేనని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఇప్పుడు డబ్బులు లేవు అంటున్న చంద్రబాబు హామీలు ఇచ్చే ముందు ఆ విషయం తెలియదా అంటూ నిలదీశారు. ఏపీలో మళ్ళీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుండేది అని ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications