కొల్లు రవీంద్ర అరెస్ట్.. భగ్గుమన్న చంద్రబాబు... మోకా హత్య కేసులో కీలక పరిణామాలు...
టీడీపీ నేత,మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తన కారులో విశాఖపట్నం వైపు వెళ్తుండగా తూర్పు గోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.మఫ్టీలో ఉన్న పోలీసులు మొదట కారు ఆపి తనిఖీలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది.
Recommended Video

కొల్లు రవీంద్రపై ఆరోపణలు...
ఇటీవల మచిలీపట్నంలో వైసీపీ నేత,మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా పోలీసులు ఆయన కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. హత్య కేసులో నిందితులు కూడా కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కర రావును హత్య చేశామని చెప్పడం గమనార్హం.

రవీంద్ర ఇంట్లో తనిఖీలు...
మోకా భాస్కరరావు హత్య కేసుకు సంబంధించి శుక్రవారం(జూలై 3) ఆయన కుటుంబ సభ్యులు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య జరిగిందని... ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భాస్కరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రవీంద్ర ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో దొరికిన సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.

భగ్గుమన్న చంద్రబాబు...
మరోవైపు రవీంద్ర హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. కేవలం కక్ష సాధింపు కోసమే రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు... ఇంతమంది నేతలను జైళ్లకు పంపించలేదన్నారు. బీసీలపై వైసీపీ పగ పట్టిందని చెప్పడానికి... అచ్చెన్నాయుడు,యనమల,అయ్యన్నపాత్రుడు,కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే నిదర్శనమన్నారు. రవీంద్ర హత్యను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

మరో ఇద్దరు నిందితుల అరెస్ట్..
మోకా భాస్కర రావు హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీలను అరెస్టు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్బాషా తెలిపారు. అంతకముందు,గురువారం మోకా భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), చింతా కిషోర్లను గురువారం ఆర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్లు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications