తన భూమినే మార్చేశారంటూ రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన మాజీ మంత్రి పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై అధికార వైసిపి కక్ష సాధింపులకు పాల్పడుతోందని పదేపదే టిడిపి నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక వైసీపీ ప్రభుత్వానికి తగ్గట్టుగా అధికారుల తీరు ఉందని కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత తన భూమిని మార్చేశారు అంటూ రెవెన్యూ అధికారుల పై ఫైర్ అయ్యారు.
జగన్.. స్టాలిన్ ను చూసి నేర్చుకో; కరోనాను తేలిగ్గా తీసుకున్నావ్ : సాధన దీక్షలో చంద్రబాబు ధ్వజం
అధికార ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన పరిటాల సునీత అలాంటి వారు తమ పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. రెవెన్యూ అధికారులు తమ నియోజకవర్గంలో భూ దస్త్రాలు, ఆన్లైన్ లో వివరాలను కూడా తారుమారు చేస్తున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనగానపల్లి మండలంలో తన పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరొకరి పేరు మీద మార్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పరిటాల సునీత రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు వంత పాడుతూ రెవెన్యూ రికార్డులను గోల్ మాల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన తన భూమిని మార్చారంటే సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పరిటాల సునీత పేర్కొన్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉండి సాగుచేసుకుంటున్న రైతులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేసిన పరిటాల సునీత, రెవెన్యూ అధికారుల తీరు మార్చుకోవాలని హితవు పలికారు.