అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలనం: మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు జీవిత ఖైదు..
బీఎంసీ కంపెనీ ఏర్పాటు సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెంగల వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆయనతో పాటు మరో 15మందికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. మరో ఐదుగురికి రెండేళ్ల చొప్పున జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించింది.
బీఎంసీ కంపెనీ ఏర్పాటు సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. శిక్షపడినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. నక్కపల్లి మండలం బంగారమ్మపాలెంలో బీఎంసీ కంపెనీ(కెమికల్ ఫ్యాక్టరీ)ని నెలకొల్పడానికి 2007లొ ప్రయత్నాలు జరిగాయి.
కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో కోశాల కొండ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. ఆయన మృతికి చెంగల వెంకట్రావు, ఆయన అనుచరులే కారణమన్న ఆరోపణలతో కేసు నమోదైంది. పదేళ్లుగా కొనసాగుతున్న ఈ విచారణకు సంబంధించి బుధవారం అనకాపల్లి సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.