పవన్ కళ్యాణ్కు షాక్: మాట్లాడుతుంటే విద్యుత్ కట్, ప్రసంగం పూర్తయ్యాకే మళ్లీ ఇచ్చారు
Recommended Video

విశాఖపట్నం: తనకు జ్వరంగా ఉన్నా జనాల కోసమే గ్రామాల్లో తిరుగుతున్నానని, ముసుగుతన్ని పడుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు సినిమా రంగంలో ఆదాయం బాగుందని, ఇటీవలే రూ.25 కోట్లు ఆదాయపు పన్ను కట్టానని చెప్పారు. కానీ దానిని కాదని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. యలమంచిలిలో ఇంతమంది జనం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
జనసేన పోరాటయాత్ర జిల్లాలోని పాయకరావుపేట, అచ్యుతాపురం మండలం పూడిమడక, యలమంచిలి పట్టణాల్లో పర్యటించారు. పవన్ మాట్లాడుతూ.. యలమంచిలి ఎమ్మెల్యే రమేష్ బాబు అక్రమ మైనింగ్ చేస్తూ రోజుకి రూ.6 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు ఆదాయంపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలు పరిష్కరించడంపై కనిపించడం లేదన్నారు.

లోకేష్కు తప్ప ఉద్యోగం రాలేదు
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో సెజ్పేరుతో ఎకరా రూపాయి చొప్పున వేలాది ఎకరాల భూములను పరిశ్రమలకు ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో నారా లోకేష్కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. భూములు తీసుకునేటప్పుడు 60 వేలమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎంతమందికి ఇచ్చాయని ప్రశ్నించారు. దీనిని ఎందుకు చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. పోనీ పరిశ్రమలు పద్ధతిగా ఉన్నాయా అంటే అదీలేదన్నారు.

అందుకే మూడో పార్టీ జనసేన అవసరం
కాలుష్యాన్ని విరజిమ్ముతూ పైపులైన్ ద్వారా కలుషిత నీటిని సముద్రంలోకి వదులుతున్నారని పవన్ మండిపడ్డారు. దీన్ని వల్ల మత్యకారులకు ఇటు పరిశ్రమల్లో ఉపాధి లభించకపోగా అటు మత్యసంపద చనిపోయి ఉపాధి కోల్పోతున్నారన్నారు. పూడిమడక గ్రామస్థులు ఇలాగే నష్టపోయారన్నారు. రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నావికా స్థావరం (ఎన్ఏఓబీ) నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను తీసుకున్న ప్రభుత్వం ఇక్కడ నిర్వాసితుల కోసం కేంద్రియ విద్యాలయం, ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి ఇంత వరకూ ఒక్కటీ చేయలేదన్నారు. ఉపాధి కూడా కల్పించలేదన్నారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల సమస్యలను పట్టించుకోనందన మూడో పార్టీ అవసరం ఏర్పడిందని, అందుకే జనసేన పార్టీ పుట్టిందన్నారు.

పవన్ కళ్యాణ్కు బహూకరణలు
సమస్యలపై బలంగా మాట్లాడి, నిలదీసి జనసేన ప్రభుత్వాన్ని నెలకొల్పుదామని పవన్ అన్నారు. యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో ఆయనకు ఓ మత్స్యకారుడు చేపలు పట్టే వలను బహూకరించారు. అలాగే, తాటాకులతో తయారు చేసి వారిచ్చిన టోపీని పవన్ తలకు ధరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. టీడీపీలోని అవినీతి చేపలను ఈ వలతో పట్టుకుని బయటవేసేద్దామని అన్నారు. ఉప్పుచేపల్లా ఎండబెడదామన్నారు. అలాగే తనకిచ్చిన ఆ టోపీని తాటాకులతో ఎంతో అందంగా తయారు చేశారన్నారు. గత పుష్కరాల్లో నిధుల దుర్వినియోగాన్ని గురించి తాను రాజమహేంద్రవరం పర్యటనలో బయటపెడతానని చెప్పారు.

పవన్ మాట్లాడుతుండగా విద్యుత్ కట్ చేశారు
కాగా, యలమంచిలిలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభించగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆయన ప్రసంగం ముగిశాక సరఫరా పునరుద్ధరించారు. దీనిపై జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పర్యటన సందర్భంగా ఎలమంచిలి పట్టణంలో అన్నివీధులు జనంతో కిక్కిరిసిపోయాయి.












Click it and Unblock the Notifications