జగన్కు సీబీఎన్ ఆర్మీ షాక్!..పాదయాత్ర సందర్భంగా కరప్షన్ ఫ్లెక్సీల ఎగ్జిబిషన్
విజయనగరం:ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర మరో వారం రోజుల్లో విజయనగరం జిల్లాకు చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ చోటుచేసుకున్న తాజా పరిణామం వైసిపిలో తీవ్ర కలకలం రేపుతోంది.
జిల్లాలోని లక్కవరపుపేటలో జగన్ పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన క్లిప్పింగ్ లతో పాటు వైకాపా నేత బొత్స గతంలో జగన్,వైఎస్ఆర్ పై చేసిన విమర్శల పేపర్ కటింగ్స్ తో కూడిన ఫ్లెక్సీలను సిబిఎన్ ఆర్మీ పేరిట ఎగ్జిబిషన్ తరహాలో ప్రదర్శనకు ఉంచటం వైసిపి నేతలకు షాక్ ఇచ్చింది. దీంతో ఆ దారి వెంబడి పోయే వారంతా అవినీతి ఆరోపణలతో కూడిన ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా చదువున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...

ఫ్లెక్సీల ఎగ్జిబిషన్...గట్టి ప్లానే
ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతున్న వైసిపి అధినేత జగన్ పాదయాత్ర మరో వారం రోజుల్లో విజయనగరం జిల్లా చేరుకోనుంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర కారణంగా ఆ పార్టీకి మైలేజ్ దక్కకుండా చేసేందుకు టిడిపి నేతలు గట్టి ప్లానే వేశారు. ఆ వ్యూహంలో భాగంగా లక్కవరపుకోటలో జగన్ అవినీతి, అక్రమాల క్లిప్పింగ్లతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరక ముందు వైఎస్ జగన్, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్లతో రూపొందించిన భారీ ఫ్లెక్సీలను ఒక వరుసలో ఎగ్జిబిషన్ తరహాలో ఏర్పాటుచేశారు.

సిబిఎన్ ఆర్మీ...ప్లాన్ కొనసాగింపు...
లక్కవరపుకోటలో ఆదివారం సిబిఎన్ ఆర్మీ పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో...టిడిపి నేతల ఊహించినట్లుగానే ప్రతిపక్ష నేత జగన్, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణలపై ఆరోపణలతో కూడిన ఈ ఫ్లెక్సీల ఎగ్జిబిషన్ ను ఆ మార్గంలో వచ్చిపోయేవారంతా ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు
టీడీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీబీఎన్ ఆర్మీ దళం ఇక ముందు కూడా ఈ తరహా ఫ్లెక్లీలతో ప్రచార పోరాటం కొనసాగిస్తుందని తెలిసింది. జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాకు చేరుకునే సమయానికి ప్రతి మండల కేంద్రం, ముఖ్య కూడళ్లలో ప్రజలు చూసేలా ఈ క్లిప్పింగ్లను ప్రదర్శించనున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి.

ఆయన కూడా...రెఢీ
కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్ గజపతి రాజు ఈ ఫ్లెక్సీల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ సమావేశంలో ఈ ఫ్లెక్సీల ప్రచారం నిర్ణయం తీసుకోగా అందుకు ఎంపీ పూసపాటి ఆశోక్ గజపతి రాజు మద్దతు ఇచ్చారని, దీంతో నియోజకవర్గాల నేతలు, ఇన్చార్జీలు వీటి ఏర్పాటుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో తొలివిడతగా విజయనగరంలో, ఆతరువాత లక్కవరపుకోటలోనూ ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధి నుంచే విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుండటంతో ఇక్కడ నుంచే ఫ్లెక్సీల ప్రచారాన్ని అస్త్రంగా వాడుకోవాలని టిడిపి నిర్ణయించినట్లు తెలిసింది.

అదీ ఉద్దేశ్యం...లక్ష్యం సిద్దించేనా?
జగన్ పాదయాత్రలకు తరలివచ్చే జనాలకు ప్రతిపక్షపార్టీ వైసీపీ ఎంతటి అవినీతి,మోసకరమైన పార్టీయో తెలియచెప్పేందుకు టిడిపి ఈ ఫ్లెక్సీల ప్రచారాన్ని వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లెక్సీల్లో వైఎస్ జగన్ చేసిన అవినీతి ఆక్రమాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు తదితర కథనాలతో పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను ఫ్లెక్సీలపై ముద్రించి వాటిని ప్రదర్శనకు ఉంచుతోంది. అలాగే జిల్లాలో ఈ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహజంగానే పాదయాత్రను విజయవంతం చేయడం ద్వారా జగన్ వద్ద తన సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి దానిని వీలైనంతమేరకు దెబ్బతీసేందుకు టిడిపి ఈ వ్యూహం అమలుచేస్తోంది. అయితే సిబిఎన్ ఆర్మీ పేరిట ఏర్పాటైన ఈ ఫ్లెక్సీల్లో అత్యధికభాగం ఆంధ్రజ్యోతి ప్రతికలో ప్రచురితమైన వార్తా క్లిప్పింగ్ లో ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications