అంబేద్కర్ ను వ్యతిరేకిస్తే దేశ బహిష్కరణ-సన్నాసి పవన్- జనసైనికులు బుడ్డోళ్లు-కొడాలి కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయాలకు తాజాగా చోటు చేసుకున్న కోనసీమ జిల్లా హింస మరోసారి ప్రాణం పోసింది. కోనసీమలో చోటు చేసుకున్న దాడులపై తాజాగా స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఇవాళ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం లింగవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని.. నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పవన్ కల్యాణ్ పై కొడాలి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ను రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసి అంటూ సంచలన విమర్శలు చేశారు. నిక్కర్లు వేసుకునే పిల్లల్ని పవన్ రెచ్చగొడుతున్నారంటూ కొడాలి ఆరోపించారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చ గొట్టి పవన్ కల్యాణ్ పబ్భం గడుపుతున్నాడని విమర్శించారు.
ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందంటూ పవన్ ను ఉద్దేశించి కొడాలి తీవ్ర విమర్శలు చేశారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. అంబేద్కర్ ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలన్నారు.ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యమి, మంత్రి ,ఎమ్మెల్యే ఇళ్లు కాదని కొడాలి పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్ళన్నారు. చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని కొడాలి నాని సూచించారు.
ప్రభుత్వం ఫైర్ ఓపెన్ చేయించి కాల్పులు జరిపితే పరిస్థితి అదుపులోనే ఉండేదన్నారు. తర్వాత చంద్రబాబు అసలు పుత్రుడు,దత్త పుత్రుడు వచ్చి చనిపోయిన వారి పాడెలు మోస్తూ శవ రాజకీయాలు చేసేవారని కొడాలి విమర్శించారు. అంబేద్కర్ ఒక్కరి వ్యక్తి కాదు భారతరత్న, అందరివాడన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి ,ఎమ్మెల్యే ఇల్లు రక్షణ పై కంటే గొడవలు అపి, ఎవరిని గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందన్నారు.