లాక్ డౌన్ వేళ.. కార్మికుల పట్ల ఆ కంపెనీ నిర్దయ.. అన్నం పెట్టకపోగా దాడి...
కరోనా లాక్ డౌన్ వేళ కంపెనీలు ఉద్యోగుల పట్ల కరుణతో వ్యవహరించాలని ఓవైపు ప్రధాని మోదీ,ముఖ్యమంత్రులు చెబుతుంటే.. కొన్ని సంస్థలు మాత్రం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. లాక్ డౌన్ కారణంగా తాడేపల్లిగూడెంలో చిక్కుకుపోయిన కొంతమంది కార్మికులకు ఓ కంపెనీ భోజనాలు పెట్టేందుకు నిరాకరించింది. దీనిపై ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినందుకు యాజమాన్యం వారిపై దాడులకు కూడా పాల్పడింది.
అసలేం జరిగింది...
తాడేపల్లిగూడెంలోని పెడతాడేపల్లిలోని శ్రీనివాస స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో దాదాపు 300 మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా ఒడిశా, బీహార్, అస్సాం,తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు. అలాగే ఆంధ్రాలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వీరంతా స్వస్థలాలకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. అటు యాజమాన్యం కూడా వీరి బాధ్యతను తీసుకోవడానికి నిరాకరిస్తోంది. 300 మంది కార్మికులు ఉంటే రోజుకు 150 మందికి మాత్రమే భోజనాలు పెట్టి సరిపెట్టుకోవాలంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే తనయుడికి ఫిర్యాదు
ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై కార్మికులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవ్వకపోగా.. కనీసం తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారని వాపోయారు.తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడుతానని విష్ణు హామీ ఇచ్చారు.
యాజమాన్యం దాడి..
కార్మికులు ఎమ్మెల్యే తనయుడిని కలిశారన్న విషయం తెలిసి ఫ్యాక్టరీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనేజర్ విజయ్ పాల్ తన అనుచరులతో కలిసి కార్మికుల వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో జుబ్బాల చిన్న అనే ఓ కార్మికుడిపై అతను దాడి చేశాడు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.