ఫ్యాన్స్ హల్చల్: చంద్రబాబుపై చిరంజీవి సెటైర్లు
భీమవరం: మెగాస్టార్, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి అభిమానుల జోరు తగ్గినట్లు లేదు. శనివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సమావేశంలో ఆయన అభిమానులు హల్చల్ చేశారు. కొంత గందరగోళం కూడా సృష్టించారు. గందరగోళంతో పార్టీ ఇతర నాయకులు ఇబ్బంది పడ్డారు.
ఈ సమావేశానికి చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి, మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో చిరంజీవి అభిమానులు సందడి చేశారు. జై చిరంజీవి అంటూ నినాదాలు చేశారు. సమావేశంలో ప్రసంగించిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సెటైర్లు విసిరారు.
ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి అడిగారు. రాజకీయాల్లో కూడా వందర రోజుల పండుగ సంప్రదాయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వంద రోజుల తర్వాత బొమ్మ తీసేస్తారని పండుగ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ హామీలపై కాంగ్రెసు కార్యకర్తలు ప్రశ్నించాలని ఆయన సూచించారు.