నీతిగల లగడపాటి మళ్లీ రావాలి: ఫ్లెక్సీల కలకలం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు సంచలనం రేపిన విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బెజవాడలో ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి.
లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అందులో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సేవలు ఎంతో అవసరమని వారు పేర్కొంటున్నారు. 'రావాలి మరల రాజకీయాల్లోకి మీలాంటి నీతిగల నాయకుడు' అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.
కాగా, లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేశారు. ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష వట్టిదేనని చెప్పేందుకు 2009లో పోటీ దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ధీటుగా సమైక్య గళం వినిపించారు.
2013లో ఏపీ పునర్యవస్థీకరణ బిల్లును లోకసభలో పెడుతున్నప్పుడు సొంత పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా... పెప్పర్ స్పేరే చల్లి సంచలనం సృష్టించాడు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని సంచలన ప్రకటన చేశారు. అన్నట్లుగానే విభజన జరిగాక ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే, ఇటీవల ఆయన కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం చాలామంది ఏపీ నేతలు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారని, ఇప్పుడు అలాంటి నేతలు రాజకీయ ప్రాధాన్యత కోల్పోయారని, వారికి ఓ దారి చూపించవలసిన బాధ్యత కిరణ్ పైనే ఉందన్నారు.