ప్రైవేటీకరణ వద్దు: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రైతు నేత రాకేశ్ టికాయత్ మద్దతు
న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి ప్రధాన కారణాలివే, ప్రైవేటీకరణ అందుకే: వైసీపీ ఎంపీకి నిర్మలా సీతారామన్
26 సంస్థలున అమ్మాలని కేంద్రం చూస్తోందని.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించొద్దని ఆయన కోరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలపై రైతులతో కేంద్రం వీలైనంత త్వరగా చర్చలు జరపాలని టికాయత్ కోరారు.
అంతేగాక, కొత్తగా కనీస మద్దతు ధరతో చట్టం తేవాలని రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం బిజీగా ఉందని, అవి పూర్తయ్యాకే చర్చలు జరుపుతుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తామని టికాయత్ స్పష్టం చేశారు.
కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత మూడు నెలలుగా దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
జనవరి 26న దేశ రాజధానిలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో 300 మంది వరకు పోలీసులకు గాయాలు కాగా, ఓ రైతు ట్రాక్టర్ బోల్తా పడి మరణించారు. ఆ తర్వాత రైల్ రోకో నిర్వహించారు. మరోసారి తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని ఈ రైతు నేత ప్రకటించారు. అంతేగాక, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని టికాయత్ చెప్పిన విషయం తెలిసిందే.