ఏపీ రైతులు మోసపోయారా ? నాలుగో విడత మాఫీ ఏదీ ? నిధులు లేకుండానే ఇచ్చేసామని ప్రచారం !
Recommended Video
ఏపిలో అయిదేళ్లుగా సాగుతున్న రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లే. 2014 ఎన్నికల సమయంలో టిడిపి రైతు రుణమాఫీకి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన తొలి సంతకం ఇదే. అయితే, ఆ తరువాత జరిగిన అనేక పరిణామల నేపథ్యంలో నాలుగు విడతలుగా రుణ మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఎన్నికల సమయంలో నాలుగో విడత రుణమాఫీ నిధులు ఇచ్చేస్తున్నాం..తీసుకోండి అంటూ ప్రచారం చేసారు. కానీ, నిధులు విడుదల కాలేదు. ఎన్నికలు సైతం ముగిసాయి..రుణాలు మాత్రం అంతే ఉన్నాయి..
అయిదేళ్లుగా సాగదీసి..
టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఏపిలో రైతులకు సంపూర్ణ రుణ మాఫీ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే 2014లో అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీ మీదే చేసారు. అయితే, ఆ తరువాత కోటయ్య కమిటీ పేరుతో రుణమాఫీ అమలు విదివిధానాలు ఖరారు చేసింది. 87,612 కోట్లుగా ఉన్న రుణాలను 24500 కోట్ల మేర మాఫీ చేసేందుకు నిర్ణయించారు. ఆ మొత్తాన్ని నాలుగు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మూడు విడతల రుణ మాఫీ నిధులు విడుదల చేసారు. నాలుగో విడత నిధులన ఎన్నికల ముందు విడుదల చేయటం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆశించారు. దీంతో..ఎన్నికల ప్రచారంలో సైతం రుణమాఫీ నాలుగో విడత నిధులు విడుదల చేసాం..తీసుకోండి అంటూ ప్రచారం చేసారు. కానీ, రైతుల ఖాతాల్లో మాత్రం రుణ విముక్తి నిధులు జమ కాలేదు.
విడుదల కాని నిధులు..
నాలుగు..అయిదో విడత రుణ మాఫీ కోసం నిధులు విడుదల కాలేదు. ఆర్దిక శాఖ తెలిపినా..వాస్తవ రూపంలో నిధుల కొరత వెంటాడుతోంది. అప్పులు తెచ్చి రుణ మాఫీ చేయాలని భావించారు. అయితే, ఆర్దిక సంవత్సరం చివర కావటం..రాష్ట్ర అర్దిక శక్తికి మించి ప్రజలకు హామీలు అమలు చెయ్యటం కోసం నిధులు సర్దుబాటు చేయాల్సి రావటం తో ఈ రుణ మాఫీకి నిధులు సర్దుబాటు కాలేదు. దీంతో, ప్రభుత్వం తాము 24500 కోట్ల మేర రుణమాఫీ చేసామని పైకి చెబుతున్నా..వాస్తవంగా అది ఇప్పటి వరకు 17వేల కోట్ల రూపాయాలు వరకు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆర్దిక శాఖ నిధులు ఇవ్వని కారణంగానే తాము రైతుల ఖాతాల్లో జమ చేయలేకపోయామని రైతు సాధికారిక సంస్థ అధికారులు చెబుతున్నారు. దీంతో..ఎన్నికల ముందైన తమ రుణాలు మాఫీ అవుతాయని భావించిన రైతలకు అది అమలు కాలేదు.
కొత్త ప్రభుత్వం వస్తే..
ఇక, కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభం కావటంతో పాటుగా ఎన్నికలు పూర్తి కావటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండి. అయితే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కొనసాగితే పెండింగ్ నిధుల విడుదల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒక వేళ ప్రభుత్వ మారితే ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు సైతం మారిపోతాయి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి వచ్చే ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పటికే జీత భత్యాలకు పోను నిర్వహణా ఖర్చులు భారీగా పెరగటంతో వచ్చే ప్రభుత్వం ఈ భారం భరించే అవకాశాలు తక్కవే. అధికారంలోకి రావటానికి వాళ్లు ఇచ్చిన హామీల అమలు బాధ్యత వారిపైన ఉంటుంది. దీంతో..ఇక, రైతులు నాలుగేళ్లకు పైగా ఎదురు చూస్తున్న రైతు రుణ మాఫీ కధ ఇక ముగిసినట్లుగానే భావించాలి.