రైతుల ఆత్మహత్యలు: కొత్త భాష్యం చెప్పిన హోం మంత్రి
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని హోం మంత్రి, ఉప మఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మల్కిపురంలో ఆయన మాట్లాడుతూ రైతులు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడితే, వారు వ్యవసాయ అప్పుల కారణంగా చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న రైతు భరోసా యాత్ర వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని చినరాజప్ప చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో అన్ని పార్టీలూ తీర్మానం చేయాల్సి ఉందని, అలాగే పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల మద్దతు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు.