మంత్రిగారూ అంటూ పలువురు ఎమ్మెల్యేలకు నేతల శుభాకాంక్షలు: మంత్రివర్గంలో వీరికి చోటుదక్కినట్లేనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత మంత్రివర్గంలోని చాలా మంది సభ్యులు తమ పదవులు వదులుకుంటున్నారని తెలిసింది. అంతేగాక, కొత్తగా పలువురికి స్థానం దక్కబోతోంది. సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోట దక్కని సీనియర్లకు, కీలక నేతలకు మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రిగారూ అంటూ కంగ్రాట్స్..
కాగా, ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నారు. మంగళవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గాన్ని అతి త్వరలో పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. సమావేశం ముగిసిన తర్వాత.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రిగారూ కంగ్రాట్స్ అంటూ సహచరులు సరదాగా శుభాకాంక్షలు తెలిపారు.
జగన్ కొత్త మంత్రివర్గంలో వీరికి చోటు దిక్కినట్లేనా..?
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులకు వారి సహచర ఎమ్మెల్యేలు అభినందనలు తెలపడం అసెంబ్లీ లాబీల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కిందనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు మంత్రి పదవులు వస్తాయనే అంచనాలతో చాలా మంది నేతలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా వెల్లడైతేగానీ, అసలు మంత్రివర్గంపై ఉత్కంఠ వీడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మంత్రివర్గ కూర్పు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Recommended Video
జనసేన-బీజేపీతో టీడీపీ కలిస్తే.. వచ్చే ఎన్నికల్లో విజయంపై చర్చ
కాగా, మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ప్రధానంగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే బీజేపీతో పొత్తు ప్రకటించిన జనసేన పార్టీ.. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోలేదని సభ్యులు చర్చించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి అధికార వైసీపీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. జగన్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమదేనని అధికార పార్టీ మంత్రులు, నేతలు అంటున్నారు.