నాగుపాముతో పిల్లి పోరాటం, పామే పారిపోయింది: సెల్ఫోన్లో తీశారు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో పాము, పిల్లి పోట్లాడుకున్నాయి. పిల్లి కాసేపు నాగుపాముతో పోరాడింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని పెదపాడులోని శ్రీకాంత్ ఇంటి ఆవరణలో చోటు చేసుకుంది.
అటుగా వెళ్తున్న నాగుపామును పిల్లి చూసింది. నాగుపాము వద్దకు వచ్చిన పిల్లి దానితో కొద్దిసేపు పోరాటం చేసింది. పాము పడగ విప్పి కాటేయబోతుంటే పిల్లి మాత్రం పులిలా తన కాళ్లతో తన్నింది. ఏ మాత్రం తనపై కాటు పడకుండా జాగ్రత్తగా పిల్లి పోరాడింది.
పిల్లి చివరికి నాగుపాముకే బుసలు తెప్పించింది. ఏమి చేయలేని నాగుపాము పిల్లికి భయపడి అక్కడి నుంచి కాసేపటి తర్వాత వెళ్లిపోయింది. పిల్లి, నాగుపాముల మధ్య జరిగిన ఈ పోరాటాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు.
గుంటూరులో పాత భవనం కూలి ఇద్దరి మృతి
గుంటూరు నగరంలోని రైలుపేట 3వ వీధిలో మంగళవారం ఉదయం పాతభవనం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు శిథాలవస్థకు చేరిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ఘటనలో అంజమ్మ(70)తో పాటు ఆమె మనువడు ప్రదీప్ కుమార్(2) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యులు శివలక్ష్మీ, సుధారాణి, లోహితాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.