ఏపీ ఆర్థిక పరిస్థితి క్రిటికల్.. అన్ని శాఖలు అలా చేయండి : యనమల
అమరావతి : ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని వెల్లడించారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడంపై ప్రస్తుతం దృష్టి సారించామని, మిగతా శాఖలు కూడా ఇదే విధానాన్ని పాటించాలని సూచించారు. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో.. వెలగపూడిలోని సచివాలయంలో అర్థ సంవత్సరం ఆదాయ వ్యయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు యనమల.
కేంద్రం సూచనను అనుసరించి ఇక వచ్చే ఏడాది నుంచి ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అని రెండు వేర్వేరుగా ఉండవని చెప్పుకొచ్చారు యనమల. దీనికి బదులుగా అభివృద్ధి, అభివృద్ధేతర ఖర్చుల ప్రస్తావన మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇక వివిధ శాఖలకు సంబంధించి రూ.20వేల కోట్ల రూపాయల వరకు డబ్బు బ్యాంకుల్లో ఉందని, పబ్లిక్ డిపాజిట్ ఖాతాలోకి ఆ డబ్బును జమచేసేందుకు రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
అలాగే.. పెండింగ్ లో ఉన్న రూ.3వేల కోట్ల డ్వాక్రా రుణమాఫీ నిధులను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని తెలియజేశారు యనమల. ఈ మేరకు సీఎం నుంచి సూచనప్రాయంగా ఆదేశాలు అందినట్లు తెలిపారు.