టీడీపీ ఎంపీలు బాగా నటిస్తున్నారు: వైఎస్ఆర్ సీపీ
న్యూఢిల్లీ: మా పార్టీ ఎంపీలతో కలిసి లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించామని, స్పీకర్ పోడియంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలిపామని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నాయకుడు వై.వీ. సుబ్బారెడ్డి, ఆ పార్టీ మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.
తాము స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో తెలుగుదేశం (టీడీపీ) ఎంపీలు హడావుడి చేయడం మొదలు పెట్టారని అన్నారు. కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న టీడీపీ పోరాటం చేస్తున్నామని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
టీడీపీ నాయకులు బాగా నటిస్తున్నారని విమర్శించారు. వైసీపీ చిత్తశుద్దితో పోరాటం చేస్తుంటే, ఒక వైపు అధికారం అనుభవిస్తూ, మరో వైపు ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా కావాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తుంటే బీజేపీ ఎంపీలు నవ్వుకుంటున్నారని వ్యంగంగా అన్నారు.
కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న టీడీపీ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఆయన మీద ఒత్తిడి తీసుకు వచ్చి ప్రత్యేక హోదా సాధించాలని, ఇలా ప్లకార్డులు పట్టుకుని డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మరని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఇకనైనా చిత్తశుద్దితో పోరాటం చేస్తే మంచిదని సూచించారు. పార్లమెంట్ లోపల, బయట తమ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చంద్రబాబు నాయుడు రెండు నాలుకలతో మాట్లాడుతూ సొంత పార్టీ నాయకులను ఆయోమయానికి గురి చేస్తున్నారని వైసీపీ ఎంపీలు విమర్శించారు.