బస్సెక్కుతున్నారా- అది లేకుంటే ఫైన్ : స్పెషల్ బాదుడు- రైల్వే ప్లాట్ ఫాంపైనా..!!
పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్తున్నారా. ప్రయాణపు ఛార్జీలే కాదు..అదనపు బాదుడుకు సిద్దపడాల్సిందే. పండుగ రద్దీ పేరుతో వచ్చినంత వసూలు చేసుకోవటానికి రైల్వే శాఖ..ఏపీఎస్ ఆర్జీసీ పోటీ పడుతున్నాయి. ఆర్టీసీ పండుగ వేళ స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. దాదాపుగా 50 శాతం అదనపు ఛార్జీలు అఫీషియల్ గా కలెక్ట్ చేస్తోంది. దీని పైన విమర్శలు వచ్చినా పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో రైల్వే శాఖ సైతం టిక్కెట్ ఛార్జీలే కాదు... చివరకు ప్లాట్ ఫాం ఛార్జీలను భారీగా పెంచింది. పండుగ రద్దీని క్యాష్ చేసుకొనే పనిలో పడింది.
పండుగ వేళ బాదుడే బాదుడు
సంక్రాంతి పండగ నేపథ్యంలో రైల్వే స్టేషన్ లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్లకు వస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈక్రమంలో రద్దీని తగ్గించే ప్రయత్నంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది.
ఇప్పటి వరకు రూ 10 గా ఉన్న ప్లాట్ ఫాం ధర ఇప్పుడు రూ 50కి పెంచారు. తక్కువ రద్దీ ఉన్న స్టేషన్లలో రూ 10 నుంచి రూ 20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండగ వల్ల రైల్వేస్టేషనల్లో పెరిగిన రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలు నేటి నుంచి.. ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.
మాస్కు లేకుంటే జరిమానా
ఇక, ఇదే సమయంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ప్రయాణీకులు మాస్కు లేకుండా ప్రయాణిస్తే వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. మాస్కు లేకుండా బస్సెక్కితే రూ 50 జరిమానా వసూలు చేసి ..దానికి బిల్లు కూడా ఇస్తున్నారు. కరోనా ప్రోటోకాల్ అమల్లో భాగంగా..నిబంధనలకు ఖచ్చితగా పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి పండుగకు నగరాల నుంచి గ్రామాలకు.. సొంత ప్రాంతాలకు వచ్చే వారు ఎక్కడిక్కడే ఆగిపోయారు. ఈ సారి కరోనా ప్రస్తుతం పెరుగుతున్నా.. అనేక మంది ప్రయాణాలకు సిద్దం అవుతున్నారు.
ప్లాట్ ఫాం టిక్కెట్ల రేట్లు పెంపు
దీంతో..ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్జీసీ మాత్రం ఛార్జీల పెంపుదల లేదని చెబుతోంది. రైల్వేలో ప్లాట్ ఫాం ధరలను పెంచేసారు. ఇప్పుడు ఇవన్నీ చూసి అసలు పండుగకు ఊరు వెళ్లాలా..వాయిదా వేసుకోవాలా అనే సందిగ్దతలో సామాన్య ప్రయాణీకులు ఉండిపోయారు. గతంలో కరోనా తగ్గుతూ.. క్రమేణా తిరిగి రైల్వే సర్వీసులు ప్రారంభమైన సమయంలోనూ ప్లాట్ ఫాం టిక్కెట్లు ఇదే విధంగా వసూలు చేసారు. కరోనా సమయంలో రైళ్ల నిలుపుదల తో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకే ఇటువంటి మార్గాల్లో వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.