రాహుల్ హత్య : ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఎవరెవరిని చేర్చారంటే-మరో అనుమానితుడి అరెస్ట్
సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో శ్యామ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో హైదరాబాద్లో జరిగిన రాంప్రసాద్ అనే వ్యాపారి హత్య కేసులో శ్యామ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ హత్యతో శ్యామ్కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శ్యామ్తో పాటు కోరాడ విజయ్ కుమార్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోరాడ విజయ్ కుమార్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
రాహుల్ హత్యకు సంబంధించి తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది.రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోఏ1గా కోరాడ విజయ్ కుమార్, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా పద్మజ, ఏ4గా గాయత్రి పేర్లను చేర్చారు. ఇప్పటికే గాయత్రి,పద్మజలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ2గా ఉన్న కోగంటి సత్యంను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

కోరాడ విజయ్ కుమార్ తన వాటా కింద వచ్చే డబ్బును తనకు ఇచ్చేయాలని రాహుల్పై ఒత్తిడి తెచ్చినట్లు రాహుల్ తండ్రి రాఘవరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే క్రమంలో కోగంటి సత్యం రాహుల్కు చెందిన కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడని... అయితే తక్కువ ధర చెప్పడంతో రాహుల్ కంపెనీని అమ్మలేదని తెలిపారు. రాహుల్ హత్య కేసులో కోరాడ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కుమార్ ఆర్థికంగా నష్టపోయాడని చెప్పారు.
రాహుల్కు విజయ్ కుమార్కు నడుమ ఏడాదిన్నరగా ఆర్థిక లావాదేవీలపై వివాదం నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న విజయ్ కుమార్ రాహుల్ కంపెనీల్లో తన వాటాను ఉపసంహరించుకోవాలని భావించారు. అయితే కంపెనీల విస్తరణపై ఫోకస్ చేసిన రాహుల్... ఇప్పట్లో అంత డబ్బు సర్దుబాటు కాదని చెప్పాడు. దీంతో రాహుల్కి చెందిన ఐదు కంపెనీల్లో జిక్సన్ సిలిండర్స్ కంపెనీని అమ్మేయాలని... తద్వారా వచ్చే డబ్బును తనకివ్వాలని విజయ్ ప్రతిపాదించాడు. అందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ వివాదం ఇలాగే సాగుతోంది.
Recommended Video
ఇదే వివాదంపై మాట్లాడేందుకు కోరాడ విజయ్ కుమార్ ఈ నెల 18వ తేదీన రాహుల్ను పిలిచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గంటలో వస్తానని చెప్పి ఒంగోలులోని ఇంట్లో నుంచి బయలుదేరిన రాహుల్... చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ మరుసటిరోజు తెల్లవారుజామున రాహుల్ మృతదేహాన్ని మాచవరం సమీపంలో కారులో గుర్తించారు. కారులో దిండు,తాడు దొరికాయి. దీంతో ఊపిరాడకుండా చేసి అతన్ని హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications