సచివాలయం రహస్య విభాగంలో మంటలు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలోని అత్యంత రహస్య విభాగం (స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ - ఎస్సీడీ) విభాగంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సమాచారం అందించడంతో అగ్ని మాపక వాహనం మంటలను ఆర్పివేసింది.
ఈ విభాగం సీ బ్లాకులోని గౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇందులో పాత ఫైళ్లు ఉంటాయి. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇందులోంచి దట్టమైన పొగలు వచ్చాయి. వాటిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అధికారులకు, సచివాలయంలోని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. అప్పటికే ఎస్సీడీ విభాగానికి చెందిన గది పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
న్యాయ విచారణ జరపాలి: దేవీప్రసాద్
సచివాలయంలోని సమతా బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ ఎన్జీవోల సంఘం నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటవుతున్న సమయంలో సీ బ్లాక్లోని ముఖ్యమైన ఫైల్స్ను తగలబెట్టే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపడంతోపాటు సచివాలయం, వివిధ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.