జగన్ దేనికైనా..: పల్లె, అమ్మేస్తారు: కెసిఆర్పై జీవన్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దేనికైనా తెగిస్తారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. తనమీదున్న అక్రమ ఆస్తుల కేసులను కొట్టేయించుకోవడం, అక్రమ ఆస్తులను రక్షించుకోవడమే జగన్ ముఖ్య ఉద్దేశమన్నారు. జనం ఏమైపోయినా ఆయనకు అక్కర్లేదని దుయ్యబట్టారు.
మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతులపై జగన్కు ఉన్నది కపట ప్రేమ అని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రభుత్వ రుణమాఫీ చేస్తుండడంతో తట్టుకోలేకే విమర్శలకు దిగుతున్నారన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి సచివాలయాన్ని బేరానికి పెట్టినట్టు ఉందని కాంగ్రెస్ శాసన సభ్యుడు జీవన్రెడ్డి విమర్శించారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని మరో చోటకు తరలించడం మంచిది కాదని ఆయన ముఖ్యమంత్రికి హితవు చెప్పారు. ఈ సచివాలయం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని, వాస్తు పేరుతో సచివాలయాన్ని మరో చోటకు తరలిస్తే ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆయన అన్నారు.
ఆర్థిక వనరులపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కెసిఆర్ వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి ప్రజల హితం గురించి ఆలోచించాలని ఆయన హితవు చెప్పారు. ఇది రాచరికం కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని కెసిఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి తీరు రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయం తరలింపు వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యక్తిగత నమ్మకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడేలా ఉండరాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications