అరబిందో ఎండీపై ఏకే47తో కాల్పులు, జగన్ పరామర్శ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్లో గల కేబీఆర్ పార్కు వద్ద బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసున్నాయి. అరబిందో ఫార్మా ఎండీ నిత్యానంద రెడ్డి పైన గుర్తు తెలియని వ్యక్తి ఏకే 47తో కాల్పులకు దిగాడు.
పార్కు వద్ద కారులో కూర్చున్న నిత్యానంద రెడ్డి పైన ముసుగు ధరించి వచ్చిన ఆ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని సమాచారం. వెంటనే స్పందించిన నిత్యానంద రెడ్డి కూడా ఆగంతకుడి పైన ఎదురు కాల్పులు జరిపాడని తెలుస్తోంది. దీంతో అగంతకుడు ఏకే 47ను అక్కడే వదిలేసిన పరారయ్యాడు.
ఇరువురి మధ్య దాదాపుగా పది రౌండ్ల మేర కాల్పులు జరిగాయని చెబుతున్నారు. ఈ ఘటనతో ఉదయం నడకకు వచ్చిన వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒక కారులో ఏకే 47 లభ్యమైంది.
అంతకుముందు అతను నిత్యానంద రెడ్డి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిత్యానందరెడ్డి, ఆయన సోదరుడుతో సదరు అగంతకుడు కాసేపు పెనుగులాడారు. నిత్యానంద రెడ్డి వాకింగ్ ముగించుకొని కారు ఎక్కే సమయంలో ఇది జరిగింది. దీని పైన నిత్యానంద విలేకరులతో స్పందిస్తూ.. తాను కారు ఎక్కే సమయంలో ఇది జరిగిందన్నారు.
వైయస్ జగన్ పరామర్శ
అరబిండో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానంద రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయనను పరామర్శించారు.
నిత్యానంద రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త. అరబిందో పార్మా మేనేజింగ్ డైరెక్టర్. జూన్ 28, 2006 నుండి మేనేజింగ్ డైరెక్టర్గా, జూన్ 1, 2012 అదే కంపెనీకి వైస్ చైర్మన్గా పని చేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలలో ఆయన బోర్డు మెంబర్. పలు కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. జగన్ కేసులో ఆయన పైన అభియోగాలు ఉన్నాయి.