ఏపీలో ఎన్నికలకు ఈసీ తొలి అడుగు-గెజిట్ నోటిఫికేషన్ జారీ..ఇక ఏ క్షణమైనా ?
ఏపీలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే ముందస్తు ఎన్నికలు జరగొచ్చన్న ప్రచారం, జమిలి ఎన్నికలకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్న అంచనాల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారుల్ని నియమించారు.
ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ లోపే జమిలి లేదా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఈసీ తాజాగా అన్ని సీట్లలోనూ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోల్ని నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లు భావించవచ్చు.

ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. 175 నియోజకవర్గాల్లోనూ ఓటర్ల జాబితాల్లో తప్పుల సవరణతో పాటు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఈసీ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగబోతోంది. అయితే ఆలోపు రిటర్నింగ్ అధికారుల్ని కూడా నియమించడం ద్వారా ఎన్నికలకు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఈసీ సంకేతాలు ఇస్తోంది. దీనికి అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్ధాయిలో పని మొదలుపెడతారు.
రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలతోనే రాజకీయపార్టీల అధినేతలు క్షేత్రస్ధాయిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు వారిలో కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా వారు తమ క్యాడర్ ను రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఈసీ కూడా అంతే వేగంగా అధికారుల్ని నియమిస్తూ, ఓటర్ల జాబితాల్ని సవరిస్తూ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఓవైపు ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు ఉండబోవని చెప్తున్నా విపక్షాలు మాత్రం ఈ వాదనను నమ్మడం లేదు.












Click it and Unblock the Notifications