ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు డప్పు కళాకారుల మృతి
చిత్తూరు: జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరకు వచ్చి తిరిగివెళ్తున్న డప్పు కళాకారులపైకి సిమెంటు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు కళాకారులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను నారాయణ(43), జయరాం(44), బీరప్ప(72), వెంకటరావు(42), లక్ష్మణ్(68)గా గుర్తించారు. వీరంతా నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన వారు.
ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర తిలకించి రోడ్డుపై తిరిగి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కళాకారులపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
డ్రైవర్ నిద్రమత్తు, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.