బస్సు ప్రమాదం: ఐదుగురు టెక్కీల దుర్మరణం
మహబూబ్నగర్: వోల్వో బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ఐబియం, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీల్లో వారు పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం ఉదయం ప్రైవేట్ వోల్వో బస్సు మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రమాదం సంభవించింది.
మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 110 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది.

దీపావళి పండుగ కోసం టెక్కీలు హైదరాబాద్ బయలుదేరారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వల్ల ప్రయాణికులు బయటపడలేకపోయారని జిల్లా కలెక్టర్ ఎం గిరిజా శంకర్ చెప్పారు. బస్సు డోర్ తెరవడం సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ విండోస్ కూడా వాటంతటవే లాక్ అయినట్లు ఆయన తెలిపారు.
అతి వేగంగా వెళ్తున్న బస్సు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా బస్సు ప్రయాణికుల బంధువులకు అధికారులు సమాచారం అందిస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నవారు 33 మంది మాత్రమే కాగా, మధ్యలో మరింత మంది బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దాదాపు అదనంగా 12 మంది బస్సు ఎక్కినట్లు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications