అమరావతిపై ప్రభుత్వం అఫిడవిట్ - నిర్మాణాలపై క్లారిటీ..!!
అమరావతి నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాల పైన తాజాగా ప్రభుత్వం..రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వసతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది. రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని నగరానికి మాత్రమే పరిమితమవుతూ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి, ఏపీ సీఆర్డీఏకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును మరోసారి కోరింది.

అయిదేళ్ల సమయం కావాలి
కొద్ది నెలల క్రితం హైకోర్టు రాజధాని కేసుల్లో ఇచ్చిన తీర్పులో భాగంగా రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీ ఆర్డీఏను ఆదేశించింది. మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన య జమానులకు ప్లాట్లను అన్ని మౌలిక వసతులతో నివాస యోగ్యమైన రీతిలో మూడు నెలల్లో అప్పగించాలని సూచించింది. దీంతో.. ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫున పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు 63,452 ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో 21,567 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందని వివరించింది.

బ్యాంకర్ల నుంచి రుణాల కోసం
ఇప్పటివరకు 41,885 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశామని వెల్లడించింది. భూసేకరణ వివా దం వల్ల 3,289 ప్లాట్లను కేటాయించడం గానీ, రిజి స్టర్ చేయడం గానీ చేయలేదని పేర్కొంది. 1.4.2022 నాటికి 17,357 ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అర్హమైనవి. ఇందులో 709 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సదుపాయాల కల్పన ఆధారంగా ప్లాట్లను దశలవారీగా రైతులకు అప్పగిస్తామని ప్రభుత్వం పేర్కొంది. నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్న అంశాన్ని అఫిడవిట్ లో వివరించారు. అమరావతి అభివృద్ధికి కావాల్సిన నిధులు భారీ మొత్తంలో సమీకరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంత పెద్ద మొత్తాన్ని ఒక బ్యాంక్ ఇవ్వడం సాధ్యం కాదని, బ్యాంకుల కన్సార్టియం ఏర్పాటు అవసరం ఉందని బ్యాంకర్లు చెప్పారని వివరించారు.

జరుగుతున్న పనులు ఇవీ..
సవరించిన మోడల్తో రూ.3,500 కోట్లకు తాజాగా ప్రతిపాదనలు పంపాలని బ్యాంకర్లు కోరినట్లుగా కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ కోసం భూములను, ప్లాట్లను వేలం వేయడానికి సీఆర్డీఏ ప్రయత్నిస్తున్న విషయాన్ని సైతం ప్రభుత్వం అఫిడవిట్ లో వివరించింది. రూ.33.51 కోట్లతో హైకోర్టు అదనపు భవనం నిర్మాణం జరుగుతుందని కోర్టుకు వివరించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు ఎన్సీసీ సంస్థకు 30.11.2022 వరకు గడువును పొడిగించామని పేర్కొంది. 18 టవర్లలోని 432 అపార్ట్మెంట్ యూనిట్ల పనులు కొనసాగుతున్నాయంటూ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న కరకట్ట సింగిల్ రోడ్డును డబుల్ లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నామని ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications