ఏపీలో గులాబీ తోట- ముళ్లు గుచ్చుకునేదెవరికి..?!
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత జరుపుకొంటోన్న తొలి సంక్రాంతి పండగ.. క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. సంక్రాంతి పండగ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొంటోన్నారు. హైదరాబాద్ లో పతంగ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదలుకుని- ఆయన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తిస్థాయి జాతీయ రాజకీయాల్లో..
కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు గత ఏడాది డిసెంబర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తరువాత బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కేసీఆర్- దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు.

ఏపీలో..
ఊహించిన దాని కంటే వేగంగా బీఆర్ఎస్.. ఏపీలో అడుగు పెట్టింది. చేరికలకు గేట్లు ఎత్తేసింది. ఫలితంగా- పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు. ఇక- ఈ సంక్రాంతి తరువాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ నాయకులు సన్నాహాలు మొదలు పెట్టారు.

విస్తృతంగా ఫ్లెక్సీలు..
సంక్రాంతి పండగ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ బ్యానర్లు వెలిశాయి. ప్రత్యేకించి- కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉన్న జిల్లాల్లో వాటిని కట్టారు. కాకినాడ, యానాం, ముమ్మడివరం, పోలవరం వంటి చోట్ల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను కట్టారు అభిమానులు. కేసీఆర్ నిలువెత్తు ఫొటోలను వాటిల్లో ముద్రించారు. కేటీఆర్ తో పాటు ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఫొటోలను ఇందులో ప్రింట్ చేశారు.

సంక్రాంతి తరువాత..
ఇక సంక్రాంతి తరువాత తోట చంద్రశేఖర్ రంగంలోకి దిగనున్నారు. పార్టీ కార్యాలయం కూడా ఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో కేసీఆర్ నిర్వహించదలిచిన బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయడంపై ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. ఈ సభకూ ఆయన హాజరు కానున్నారు. ఏపీ అధ్యక్షుడి హోదాలో ఆయన పాల్గొననున్నారు. ఏపీలోని సరిహద్దు జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించే ప్రయత్నాల్లో ఉన్నారాయన.












Click it and Unblock the Notifications