విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు: శుభవార్త చెప్పిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అన్ని రంగాల్లోనూ ప్రగతి పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు. ఆదిలో ఆరంభ శూరత్వం చివరి దాకా నిలవాలని ఆశిస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా ఏపీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడుకు అవకాశం రావటంతో ఏపీలో విమానయాన సేవలపై భారీ అంచనాలే వ్యక్తం అవుతున్నాయి.
విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు
ఏపీలో అన్ని ప్రాంతాలను కలిపేలా విమాన సర్వీసులను పెంచటంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారిస్తున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంబైకి విమాన సర్వీసులు నడిపేందుకు లైన్ క్లియర్ అయింది. ఆగస్టు 16 నుండి సర్వీసులు నడిపేందుకు సిద్ధం అయ్యింది. ఇదిలా ఉంటే విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మరో గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి భరత్.

కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్
నేడు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భరత్ కలిసి విజయవాడ నుండి కర్నూలు ఎయిర్పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
కర్నూలుకు విమాన సర్వీసుల పనులు ప్రారంభించాలని ఆదేశం
విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఏడాదిలోపు రాత్రి సమయాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తానని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారని టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారన్నారు.
పారిశ్రామిక ప్రగతిలో విమాన సర్వీసులు ఒక భాగం
పారిశ్రామికవేత్తలు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు రాకపోకలు సాగించేందుకు కర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తేనే సౌకర్యంగా ఉంటుందని టి.జి భరత్ పేర్కొన్నారు. విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చి, మౌలిక వసతులు కల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు, అందుకు విమానయాన సర్వీసులు ఉండటం కూడా అవసరమని టి.జి భరత్ తెలిపారు.












Click it and Unblock the Notifications