కాసులొచ్చే శాఖల మీద కన్నేయండి అంటున్న ఎపి సిఎం చంద్రబాబు
అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఆదాయం వచ్చే శాఖలేవో గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా రాబడి ఉండే పర్యాటక, పరిశ్రమల రంగాల ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
వివిధ శాఖల వృద్ధి రేటుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పరిపాలనలో ఎపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధునిక టెక్నాలజీ సంస్కరణలను వినియోగించుకునే విధంగా అధికారులు నూతన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

టెక్నాలజీని వాడుకోండి...
ఎపి ప్రభుత్వం ఆసియాలోనే ఎక్కడా లేని విధంగా పరిపాలనలో సాంకేతికతను జోడించి పనితీరు మెరుగుదలకు,పారదర్శకతకు కృషి చేస్తోందని సిఎం చంద్రబాబు చెప్పారు. అధికారులు ఈ విషయాలను గమనించి శాఖల ఆదాయం, పనితీరు మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీ తోడ్పాటును వినియోగించుకోవాలని సిఎం సూచించారు. రాబడిని పెంచుకునేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్, ప్రణాళిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సమన్వయంగా పనిచేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

వృద్ధి రేటు ఇలా ఉంది...
ముందుగా ఏయే రంగాల్లో వృద్ధి రేటు పెరుగుతుందో , ఏ రంగాల్లో ఆశాజనకంగా లేదో గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులను హెచ్చరించారు.
ఆ తరువాత ఆయా రంగాల గురించి సమగ్ర విశ్లేషణ చెయ్యాలని అన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో వృద్ధి రేటుకు ప్రామాణికాలైన 100 అంశాలను తీసుకుంటే 40 అంశాలలో వృద్ధి రేటు 80 శాతం, 60 అంశాల్లో మాత్రం 20 శాతమే ఉందన్నారు. ఎక్కవ అంశాల్లో వృద్ధి రేటు తక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించి ఆయా శాఖల్లో రాబడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

సూచికలే ముఖ్యం....
ఎపిలో ఎప్పటికప్పడు చిన్న, మధ్య, పెద్ద తరహా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించుకుంటూ ఉండాలని, ఆయా ప్రాజెక్టులు నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సిఎం అధికారుల్ని ఆదేశించారు. అలాగే అభివృద్ధికి అవకాశం కల్పించే సూచికల్నిగుర్తించాలన్నారు. వివిధ రంగాల్లో వినియోగం, ఉత్పత్తి ఎలా ఉందో అంచనాలు వేసుకుని, వాటి సూచికల్ని విశ్లేషించాలన్నారు.

మళ్లీ సమీక్షిస్తా...
డిసెంబర్ 12న మళ్లీ ఇదే అంశాలపై శాఖాధిపతులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ సమీక్షకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమై రావాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications