5 నెలలుగా బాలకృష్ణ రాలేదు: దున్నపోతులపై పేరు రాసి..
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్. ఎండకాలం రావడంతో హిందూపురం ప్రజలు తాగేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు.
హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో షాక్. ఎండకాలం రావడంతో హిందూపురం ప్రజలు తాగేందుకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దీనిపై బాలకృష్ణ దృష్టి సారించలేదని ఆరోపిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ సీఎం బావమరిది ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బిందెడు నీటిని రూ.10కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. పనులు మానుకొని మంచి నీటి కోసం పోరాటం చేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
అయిదు నెలలుగా బాలకృష్ణ నియోజకవర్గం వైపు రాలేదని, బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అయినా బాలకృష్ణ స్పందించలేదని అంటున్నారు.
మంగళవారం హిందూపురం పట్టణంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చారు. ఈ ర్యాలీకి ఊహించని సంఖ్యలో మహిళలు వచ్చారు.
తమ కష్టాలను ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా వారు దున్నపోతులను కూడా ర్యాలికి తీసుకు వచ్చారు. వాటిపై బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు.
అయితే దున్నపోతులపై రాతల విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. దున్నపోతులను తీసుకు వెళ్లారు. నీటి కోసం అడిగితే లాఠీఛార్జ్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.