వెంకటరెడ్డి ఆచూకి తెలిస్తే చెప్పండి, మాజీ డైరెక్టర్ మాయం, పెద్దిరెడ్డి దెబ్బ
ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆచూకి చిక్కడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని అధికారులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగి కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది. వందల కోట్ల రూపాయల ఇసుక, గనుల స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి ఆచూకి తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ డైరెక్టర్ గా పని చేసిన వెంకటరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలు గాలికి వదిలేసిన వెంకటరెడ్డి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇసుక లీజు అగ్రిమెంట్లు చేశారని, క్వారీలు అప్పజెప్పారని, ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వచ్చిందని వెంకటరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సానుభూతి పరులకు చెందిన కంపెనీలు చెప్పినట్లు ఆడిన వెంకటరెడ్డి ఆయన విధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక లీజుకు కాంట్రాక్టులు తీసుకుని వ్యాపారం చేసిన ఓ ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వానికి సుమారు రూ. 800 కోట్లకు పైగా బకాయిలు ఉన్నా ఆ కంపెనీ ఎలాంటి డబ్బులు చెల్లించనవసరంలేదని వెంకటరెడ్డి ఎన్ ఓసీ ఇచ్చేశారని, ఇలా గనుల శాఖకు భారీ నష్టం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంకటరెడ్డిని అన్ని పదవుల నుంచి తప్పించారు. విజయవాడలోని తాడిగడప సమీపంలోని ఏపీఎండీసీకి చెందిన గెస్ట్ హౌస్ ఖాళీ చేసిన వెంకటరెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయారు. గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి ఆయనప ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెంకటరెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆయనకు సమాచారం ఇవ్వడానికి అధికారులు హైదరాబాద్ వెళ్లారు.

అయితే హైదరాబాద్ లోఎక్కడా ఉన్నారో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకటరెడ్డి అన్యమయ్య జిల్లాలోని ఓబుళవారి పల్లెలోని ఇంటి అడ్రస్, తిరుపతిలో కొత్తగా నిర్మించిన ఇంటి అడ్రస్, చెన్నైలో ఓ ఇంటి అడ్రస్ ఇచ్చారని, అయితే ఆ మూడు చిరునామాల్లో ఆయనలేరని, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకటరెడ్డి ఆయన ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పారిపోవడం మరో నేరం అవుతుందని, ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications