పక్కరాష్ట్రంలా చేయట్లేదు, ఇన్ఫోసిస్ చీఫ్ పొగిడారు: కేసీఆర్, రాజయ్య రాక
హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసం తెరాస ప్రభుత్వం మూడు భాగాలుగా పని చేస్తోందని సీఎం కే చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. కొంపల్లిలో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాస మూడు భాగాలుగా పని చేస్తోందన్నారు. విస్తృతస్థాయి భేటీలో మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య కూడా పాల్గొన్నారు.
తమ పార్టీ నిరుపేదల కోసం పని చేస్తోందన్నారు. మొదటి ప్రాధాన్యత పేదలకు అని, రెండో ప్రాధాన్యత వ్యవసాయం అన్నారు. మూడో ప్రాధాన్యత పెట్టుపడి రంగానికి అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. అందుకే ఈ మూడు భాగాలుగా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఇంకా అనేక సమస్యలు ప్రభుత్వం ముందు ఉన్నాయన్నారు.
మనం పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పామని, అలాగే చేశామన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెయ్యలేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తాము పక్క రాష్ట్రం మాదిరి చేయలేదన్నారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పామని, అలాగే ఇచ్చామన్నారు. ఆడపిల్లల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు.
పరిశ్రమలపై...
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం సింగిల్ విండోను తీసుకున్నామన్నారు. పదిహేను రోజుల్లో అనుమతులు వచ్చేలా చూస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం ఐఐపీహెచ్ఎస్ ఫౌండేషన్ రాయి సందర్భంగా ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి తనను ప్రశంసించారని చెప్పారు.
తెలంగాణకు కృష్ణపట్నం.. హిందూజా నుండి రావాల్సిన విద్యుత్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మనకు మరికొద్ది రోజుల్లో విద్యుత్ లోటు తీరనుందన్నారు. రెండేళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంట్ పోదన్నారు.
తాను ఇవన్నీ చెబితే కాంగ్రెస్ నేతలో ఏదో చెబుతుంటారని విమర్శలు చేస్తుంటారని, కానీ తాను చేస్తానని, అవి జరుగుతాయని కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసునని చెప్పారు. కేసీఆర్ మొండి అనే విషయం అందరికీ తెలుసు అన్నారు. తెలంగాణను ఏవిధంగానైనా ముందుకు తీసుకుపోవాలనే దాని పైనే దృష్టి సారించామన్నారు. అర్హులైన ప్రతి పేదకు పథకాలు అందేలా చూస్తామన్నారు.
తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేయాలన్నారు. తెలంగాణకు వర్షాలు రావాలని, కరువు ఉండకూడదన్నారు. అందుకే మిషన్ కాకతీయను తీసుకు వచ్చామన్నారు. చెట్లు నాటే కార్యక్రమం కూడా చిత్తశుద్ధితో యజ్ఞంలా కొనసాగించాలన్నారు. మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు నాటాలని సంకల్పించామన్నారు. ఊరికే మాట్లాడితే పేదరికం పోదని, పని చేయాలన్నారు.
కొన్ని వందల మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు, దేవాలయ కమిటీ పోస్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెరాస పూర్తిస్థాయిలో బలోపేతం కావాలన్నారు. కలలు కనాలని, వాటికి అనుగుణంగా ఎదగాలన్నారు. తాను తెరాస పెట్టినప్పుడు ఎంతో అవమానించారన్నారు. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్లామని, దీంతో, తెలంగాణ సాధనలో విజయం సాధించామన్నారు. ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు.