పవన్ ఓట్ బ్యాంక్ వ్యూహానికి జేపీ గండి - అదే చేస్తే దేశం దివాలా..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. సీఎం జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు నిర్ణయించాయి. జగన్ హామీలకు ధీటుగా సంక్షేమ - అభివృద్ధి అంశాలను ఇందులో ప్రతిపాదించారు. వీటితో పాటుగా ఉద్యోగులకు జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం చేర్చారు. ఇప్పుడు ఇదే అంశం పైన మాజీ ఐఏఎస్ జయ ప్రకాశ్ నారాయణ చేసిన కామెంట్స్ రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో
ఏపీలో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా జనసేన నుంచి ఆరు కీలక అంశాలను ప్రతిపాదించారు. వారాహి యాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టో లో చేర్చాలని జనసేన కోరింది.

అందులో..పారిశ్రామిక అభివృద్ధి కోసం సంపన్న ఆంధ్రప్రదేశ్, అమరావతిని రాజధానిగా కొనసాగింపు, విశాఖ,విజయవాడ,తిరుపతి, లను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి, బీపీఎల్ కుటుంబాల వారికి ఉచితంగా ఇసుక, భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం, జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు, ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం వంటివి ప్రధాన అంశాలుగా ప్రతిపాదించింది. వీటికి టీడీపీ నుంచి సానుకూలత వచ్చింది.
ఓపీఎస్ పై జేపీ కామెంట్స్
ఇదే సమయంలో ఉద్యోగులను ఆకట్టుకొనేందుకు జనసేన ప్రతిపాదించిన జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అంశం రాజకీయంగా చర్చకు కారణమైంది. ఈ అంశం పైన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల గండం గట్టెక్కటానికి ఉద్యోగ సంఘాలు..సంఘటిత వర్గాలకు భయపడిపోతూ దేశ ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని జేపీ వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పెన్షన్ చెల్లించటానికి ఇప్పుడు బడ్జెట్ లో డబ్బులు కేటాయించకుండా భవిష్యత్ తరాలు పన్నుల రూపంలో చెల్లించేలా ఆలోచనలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా అయితే, ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో దివాళా తీయటం ఖాయమని స్పష్టం చేసారు. ఎన్ పీ ఎస్ తో ప్రజల పై భారం ఉండదన్నారు. 19 ఏళ్ల క్రితం కొత్త పెన్షన్ స్కీం ఒప్పుకొని.. ఇప్పుడు తిరిగి ఎన్నికల కోసమంటూ ఓపీఎస్ వైపు తిరిగి వెళ్తున్నాయని పేర్కొన్నారు.
జనసేన హామీ .. వైరల్
పార్టీలకతీతంగా ఉద్యోగుల నిజమైన సమస్యలను గుర్తించటంతో పాటుగా వారి భవిష్యత్ కు భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ నాడు సీపీఎస్ రద్దు పైన హామీ ఇచ్చారు. కానీ, ఆచరణలో ఎదురయ్యే సమస్యలను ఉద్యోగ సంఘాలకు వివరిస్తూ..గ్యారంటీ పెన్షన్ స్కీం కు ఆమోదం తెలిపారు.
ఇప్పుడు జనసేన తమ మేనిఫెస్టో అంశాల్లో భాగంగా తాజాగా జీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు ప్రతిపాదించింది. దీని ద్వారా ఉద్యోగులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఈ అంశంలో జేపీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీని పైన టీడీపీ - జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications