కూటమి సర్కార్ లో తొలి నామినేటెడ్ పోస్టు భర్తీ-బీసీ బ్యూరోక్రాట్ కు దక్కిన ఛాన్స్..!
ఏపీలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పై నేతల్లోనూ అంతే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా టికెట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టుల రేసులో పోటీ పడుతున్నారు. అసలే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. దీంతో ఎవరికి ఏ పోస్టు ఇస్తే ఏం తంటా వస్తుందో అన్న భయం సీఎం చంద్రబాబును వెంటాడుతోంది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే కూటమి సర్కార్ లో తొలి నామినేటెడ్ పోస్టును భర్తీ చేశారు.
ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ కావడంతో ఆయన కూడా అంతే వేగంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టాక తొలి నామినేటెడ్ పోస్టును ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించారు. మాజీ బ్యూరోక్రాట్ కూడా అయిన కృష్ణయ్య తనకు లభించిన పదవిపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.

పీసీబీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యను పార్టీ కార్యాలయ సిబ్బంది, నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తొలి నామినేటెడ్ పోస్టును దక్కించుకున్న కృష్ణయ్య కోసం కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కృష్ణయ్యకు కీలక పదవి కట్టబెట్టడం పట్ల టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పదవిలో ఆయన రాణించాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications