జనసేనాని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ను స్వీకరించిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఏమన్నారంటే!!
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేనేత ఉత్పత్తుల ప్రచారానికి శ్రీకారం చుట్టి చేపట్టిన హ్యాండ్లూమ్ ఛాలెంజ్ ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజల నుంచి కూడా చేనేత ఉత్పత్తులపై విశేషమైన స్పందన వస్తుంది. ఎవరికి వారు చేనేత వస్త్రాలను ధరించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ చేనేత ప్రాధాన్యతను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హ్యాండ్లూమ్ ఛాలెంజ్ కు మాజీ మంత్రి బాలినేని స్పందన
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హ్యాండ్లూమ్ ఛాలెంజ్ విసరగా, కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ తాను స్వీకరిస్తున్నానని పేర్కొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలను ధరించిన తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాదు ఇక పవన్ కళ్యాణ్ తాను కూడా హ్యాండ్లూమ్ ఛాలెంజ్ ను వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు విసిరారు. పవన్ కళ్యాణ్ చేసిన హ్యాండ్లూమ్ ఛాలెంజ్ పై వైయస్సార్ సిపి నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
ఫోటోలు పోస్ట్ చేసి చేనేతపై మంత్రి బాలినేని చెప్పిందిదే..
చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ట్విట్టర్లో పంచుకున్నారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హ్యాండ్లూమ్ ఛాలెంజ్ ను స్వీకరించానని చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేనేత మంత్రిగా పనిచేశానని పేర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి నాడు వైఎస్ఆర్ హయాంలోచేతి వృత్తులకు మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి చిత్తశుద్ధితో పనిచేశామని వెల్లడించారు.
జగన్ హయాంలోనూ నేతన్న నేస్తంతో నేతన్నలకు చేయూత
ఇక నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నాము అని స్పష్టం చేశారు. అప్పుడూ, ఇప్పుడూ చేతివృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధికి నిజాయితీగా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన సూచించారు. తండ్రి బాటలో తనయుడు వైయస్ జగన్ కూడా చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పే ప్రయత్నం తన పోస్ట్ ద్వారా చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
చేనేత కోసం పార్టీల మధ్య ఉన్న విబేధాలు పక్కనపెట్టి పాజిటివ్ గా స్పందిస్తున్న నేతలు
రాజకీయంగా పార్టీ నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, సామాజిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడంలో అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని సందేశాన్ని తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న హ్యాండ్లూమ్ చాలెంజ్ తెలియజేస్తుంది. జనసేన పార్టీకి రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీతో విభేదాలు ఉన్నప్పటికీ, నేతన్నల కోసం మంత్రి కేటీఆర్ చేసిన చాలెంజ్ కు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన చాలెంజ్ కు వైయస్సార్ సిపి మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. చేనేతను ప్రోత్సహించడం కోసం, నేతలు విభేదాలు పక్కన పెట్టి చేస్తున్న ఈ పని ప్రజల నుండి విశేషంగా మన్ననలు పొందుతోంది.