అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చినా..: డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలనం..!!
అమరావతి భవిష్యత్ పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి వాటిని కొనసాగిస్తున్నారు. అమరావతికి చెందిన కొందరు రైతులు కడప జిల్లాలో డీఎల్ ను కలిసారు. ఆ సమయంలో అమరావతికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు..కోర్టులో కేసు వ్యవహారం పైన చర్చించారు. ఆ సమయంలో డీఎల్ అమరావతి పైన ప్రభుత్వ ఆలోచనలు.. కోర్టు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉందనే అంచనాలను వెల్లడించారు. తీర్పు అమరావతికి అనుకూలంగా వచ్చినా ఏం జరిగేదిదే అంటూ డీఎల్ జోస్యం చెప్పారు.
కడప జిల్లా ఖాజీపేటలో అమరావతి రైతులు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసారు. అమరావతి రాజధానిగా మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కోణంలో అమరావతి రాజధాని కాకపోయినా.. ప్రజలు మాత్రం అమరావతినే రాజధానిగా భావిస్తున్నారని డీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని పైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న అంశం పైన డీఎల్ స్పందించారు. హైకోర్టు తీర్పు పైన సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి అక్కడ విజయం దక్కదని డీఎల్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రులు అమరావతి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని డీఎల్ జోస్యం చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో అమరావతికి తీర్పు అనుకూలంగా వచ్చినా.. ప్రస్తుత ప్రభుత్వం అమరావతి కోసం ఏం చేయదని డీఎల్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయంటూ డీఎల్ కామెంట్ చేసారు.

ఇక, 2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన డీఎల్ ప్రస్తుతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత వీర శివారెడ్డి తనతో పాటుగా డీఎల్ టీడీపీలో చేరుతున్నామంటూ వెల్లడించారు. అయితే, డీఎల్ కు సంబంధించి సీటు పైన హామీ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. డీఎల్ మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా సీనియర్ నేత సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. సీటు పైన స్పష్టత వచ్చిన తరువాతనే డీఎల్ టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది. ఇప్పుడు అమరావతికి సంబంధించి డీఎల్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications