పుట్టపర్తిలో కిందపడ్డ మాజీ మంత్రి గీతారెడ్డి: స్వల్పగాయాలు, కంటతడి
అనంతపురం: మాజీ మంత్రి గీతారెడ్డి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రమాదవశాత్తూ కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి శుక్రవారం ఆమె శిల్పారామాన్ని సందర్శిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా తన చీర తన కాళ్లకే తగులుకోవడంతో కింద పడిపోయారు.
దీంతో ఆమె చేతికి స్వల్పగాయం కావడంతో బాధను తట్టుకోలేక కంటతడి పెట్టారు. వెంటనే అధికారులు ఆమెను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.
అక్రమాలు కప్పి పుచ్చుకోవడానికే జగన్ గూటికి: బొత్సపై మంత్రి కిషోర్ బాబు
కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ తన అక్రమాలు కప్పి పుచ్చుకోవడానికే అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గూటికి చేరుతున్నారని ఏపి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘బొత్స అవినీతిపరుడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమా లు జరిగాయి. తల్లి కాంగ్రెస్.. పిల్లకాంగ్రెస్ ఒక్కటే' అని మంత్రి అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్లాగే బొత్స అవినీతి అక్రమాలుచేసి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి రావెల దుయ్యబట్టారు. తెలంగాణలో టిడిపిని బదనాం చేసేందుకు టిఆర్ఎస్తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నిందన్నారు.
రాజకీయాల్లో పనికిమాలిన వ్యక్తి జగన్: అచ్చెన్నాయుడు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్కు విమర్శించడం తప్ప.. రాజకీయాల గురించి ఏమి తెలుసని కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాజకీయాల్లో పనికిమాలిన వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట మండలం నడగాం, చెన్నాపురంలో గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి-మాఊరు' కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. జగన్ చేస్తున్న దీక్ష దేనికోసమని ప్రశ్నించారు. లేనిపోని ఆరోపణలు, దోచుకోవడం తప్ప అభివృద్ధి అంటే ఏమిటో జగన్కు తెలియదని విమర్శించారు.