'వారు భారత్ లాంటి శత్రువులే': పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద కామెంట్స్!
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో గత కొంతకాలంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలపై స్పందించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. పాక్ సైన్యం చర్యలను సమర్థిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
పీవోకేలోని రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండలో దాదాపు 32 మందికి పైగా కాశ్మీరీ నిరసనకారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఆయన నిరసనకారులను "భారత్ లాంటి శత్రువులు"గా చూస్తున్నానని వ్యాఖ్యానించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. "నేను ఆజాద్ కాశ్మీర్ నిరసనకారులను భారతదేశంతో సమానంగా చూస్తాను. వారిని కూడా భారత్లాగే శత్రువులుగా పరిగణిస్తాను," అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వైరల్ అవుతున్న ఆ వీడియోలో అన్నారు. మరోవైపు ఆయన పాక్ సైన్యం జరిపిన క్రూరమైన హత్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు.

పీవోకేలో అశాంతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో జూన్ 5 నుంచి 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మీర్పూర్ నగరంలో పాకిస్తానీ భద్రతా సిబ్బంది పౌరులపై బహిరంగంగా కాల్పులు జరపడం, ఆ తర్వాత మృతదేహాలను తమ వాహనాల్లోకి ఎక్కించడం చూపిస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. మృతులలో ఎక్కువ మంది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)కి చెందిన కార్యకర్తలు ఉండడం గమనార్హం. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తి చూపినందుకు పాకిస్థాన్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సంస్థను నిషేధించింది. మృతులలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక సభ్యుడైన ఉమర్ నజీర్ తమ్ముడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నారు.
"I put the protesters of PojK in the same category as India and consider them as enemies": Pak Def Min Khawaja Asif pic.twitter.com/YS9NzhW9Jf
— OsintTV 📺 (@OsintTV) July 28, 2026
క్రూరమైన హత్యలు
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)తో సహా పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసిన వీడియోలలో, స్థానికులు తమను తాము రక్షించుకోవడానికి పరుగెడుతుండగా పాకిస్తానీ దళాల క్రూరత్వం కనిపించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో రోడ్లపై పడి ఉన్న మృతదేహాలు, ఎక్కడ చూసినా కిందపడిపోయిన మోటార్బైక్లు కనిపించాయి.పీవోకేలో పాకిస్థాన్ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా తమ మద్దతును తెలియజేయడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు.
పీవోకేలోని రావల్కోట్లో పాకిస్తానీ దళాలు ప్రజలపై కాల్పులు జరిపాయని కూడా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపించింది. "రావల్కోట్లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. శాంతియుత ప్రజలపై దళాలు షెల్లింగ్, కాల్పులు జరుపుతున్నాయి" అని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. మీర్పూర్ అవామీ యాక్షన్ కమిటీకి చెందిన యువ సభ్యులను పాకిస్తానీ పోలీసు అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
పాకిస్థాన్ సర్కారు, పాకిస్థాన్ భద్రతా బలగాలు పీవోకేలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సొంత ప్రజలను శత్రువులుగా పరిగణించడం, మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు పాకిస్థాన్ దళాల షెల్లింగ్, కాల్పుల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా పీవోకే ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications