చంద్రబాబుపై సీనియర్ నేతల అసంతృప్తి: టీడీపీకి మాజీ మంత్రి అరుణ రాజీనామా
విజయనగరం: తెలుగుదేశం పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలు సీనియర్ నేతలకు సరైన గౌరవం తక్కడం లేదని ఆమె వాపోయారు. పార్టీని వీడుతున్న సందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల తాను 1985లో రాజకీయ రంగప్రవేశం చేశానని తెలిపారు. ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని తెలిపారు. కానీ, వాటిని ఇప్పుడు టీడీపీ గుర్తించడం లేదన్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్నానని, తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని పడాల అరుణ ఆరోపించారు.
కాగా, పడాల అరుణ 1987లో బొండపల్లి మండలం అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి పలు పదవులు నిర్వహించినప్పటికీ.. 2013 నుంచి ఆమెకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన తనను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు.
మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా టీడీపీకి రెబల్ నేతలుగా మారారు. ఇక కిమిడి నాగార్జునకు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు సొంతంగా పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం గమనార్హం.
Recommended Video
మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కీలక నేత అశోక్ గజపతిరాజు లకు వ్యతిరేకంగా స్థానిక చోటామోట నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.