పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు " ఫ్లవర్ " స్టార్ - మాజీ మంత్రి రోజా
పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అని.. కానీ ఇప్పుడు ఫ్లవర్ స్టార్ అని మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా తమకు మాత్రం జాబ్ లు తెచ్చుకున్నారని మండిపడ్డారు. పవన్ తనకు డిప్యూటీ సీఎం జాబ్.. తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ జాబ్ ఇప్పించుకున్నారు కానీ యువతను మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ యువతకు చేసిన మోసాన్ని.. నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి వినతిపత్రం ఇస్తున్నారన్నారు రోజా. ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదని.. ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షలు ఇల్లు ఉన్నాయన్నారు. ఆ నిరుద్యోగుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీలో ఇప్పటివరకు ఒక టీచర్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.

నేడు యువత సమస్యలపై పోరుబాట కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ వద్ద యువకులు, నిరుద్యోగులు, విద్యార్ధులు నిరసన చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందని.. ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లు ఉందని మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ యువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందిస్తున్నారు.
మరోవైపు మాజీ సీఎం జగన్ కు వస్తున్న జనాదరణ చూసి.. కూటమి ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతుందని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. కక్ష్య సాధించడంలో భాగామే సింగయ్య కేసు అని అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు వదిలారన్నారు. ఒక ఫేక్ వీడియోను వదిలి వైసీపీని భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో, సింహాచలం, తిరుపతి, కందూరులో ఎంత మంది చనిపోయారా గుర్తు లేదా అని ప్రశ్నించారు. అందుకు చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టాలి అంటూ రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications