విజయవాడ జైలు వద్ద కొడాలి, పేర్నికి షాక్-జగన్ తో పాటు ఆయనకే ఎంట్రీ..!
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారును కిడ్నాప్ చేసి బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి చుక్కెదురైంది. ఇవాళ వంశీని పరామర్శించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ రావడంతో ఆయనతో కలిసి జైల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ఫిర్యాదు దారుగా ఉన్న సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో ఆరెస్టు అయి రిమాండ్ పై విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైైసీపీ నిన్న జైలు అధికారుల అనుమతి కోరింది. వైసీపీ అధినేత జగన్ తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కూడా వస్తారని సమాచారం ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో జైలు అధికారులు వీరికి ట్విస్ట్ ఇచ్చారు.
ఇవాళ ఉదయం జైలు వద్దకు జగన్ తో పాటు వచ్చిన కొడాలి నాని, పేర్నినానిని అధికారులు లోపలికి అనుమతించలేదు. అయితే జగన్ తో పాటు వచ్చిన అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మాత్రం జైల్లోకి అనుమతించారు. దీంతో జగన్, సింహాద్రి రమేష్ మాత్రమే జైల్లోకి వెళ్లి వల్లభనేని వంశీని ములాఖత్ లో పరామర్శించి వచ్చారు. కొడాలి నాాని, పేర్ని నాని మాత్రం జైలు బయటే ఉండిపోయారు. వాస్తవానికి వీరిద్దరికీ వంశీకి సన్నిహితులుగా పేరుంది.












Click it and Unblock the Notifications