షర్మిల దూకుడు: నంద్యాల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూతురికి కాంగ్రెస్ కండువా
YS Sharmila: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడులైన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు. టికెట్ దక్కుతుందనే ఉద్దశంతో ప్రత్యామ్నాయ పార్టీల కండువాలను కప్పుకొంటోన్నారు.
ఈ విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తోన్నారు. టికెట్ రాని అసంతృప్తులను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో సక్సెస్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ సహా వివిధ పార్టీలకు చెందిన అసంతృప్త నాయకులకు ఆమె పార్టీలో చేర్చుకుంటోన్నారు. కండువా కప్పుతున్నారు.

ఇప్పటికే ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఆదివారమే ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ షర్మిలను కలిశారు. ఆమె చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇదే చింతలపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్టే.
తాజాగా మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాపట్ల జిల్లా సంతనూతలపాడు మాజీ శాసన సభ్యుడు దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆమెకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. 2004లో దారా సాంబయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి విజయం సాధించారు.
నంద్యాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కూడా వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ ఎస్టీ విభాగం ఇన్ఛార్జ్ సృజన.. కాంగ్రెస్లో చేరారు.












Click it and Unblock the Notifications