జగన్కు షాక్: టీడీపీలో చేరిన గుర్నాథ్ రెడ్డి, ఎవరితో పోరాడాలని ప్రభాకర్ చౌదరి ప్రశ్న
Recommended Video
అమరావతి/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. క్యాంపు కార్యాలయంలో ఆయనకు కండువా కప్పిన అధినేత టీడీపీలోకి ఆహ్వానించారు.
పాదయాత్రలో షాకింగ్, నిజమా: 'జగన్ చెప్పిందేమిటి, చేస్తుందేమిటీ!?'
గుర్నాథ్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ఎర్రిస్వామి రెడ్డి కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం నగరపాలక కార్పొరేటర్లు సుకూర్, మల్లికార్జున, సరోజనమ్మ, వెంకటరమణమ్మ, రుద్రంపేట సర్పంచి కాళ్యానాయక్ తదితరులు కూడా చేరారు.
చేరికకు జేసీ దివాకర్ రెడ్డి హాజరు
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యేలు పీజే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ నేతలు జేసీ పవన్ కుమార్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. కాగా, గుర్నాథ్ రెడ్డి చేరిక వెనుక జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారని ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలు నిజమేనన్నట్లు జేసీ కూడా గుర్నాథ్కు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ప్రభాకర్ చౌదరి గైర్హాజరు
గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరే కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి గైర్హాజరయ్యారు. ఆయన చేరికను ప్రభాకర్ చౌదరి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నచ్చ చెప్పినా ఆయన తగ్గినట్లుగా లేదు. గుర్నాథ్ రెడ్డి వ్యాపార కారణాలతో పాటు మిస్సమ్మ బంగ్లా కోసం వచ్చారని చెబుతున్నారు.
చంద్రబాబు పిలిచి మాట్లాడినా నో
తన రాజకీయ ప్రత్యర్థి గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేర్చుకోవడాన్ని ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయనలో అసంతృప్తి అలాగే ఉంది. గురువారం ఆయన మరోసారి చేరికపై మండిపడ్డారు.
ఇక ఎవరితో పోరాడాలి
కబ్జాలు, హత్యలే గుర్నాథ్ రెడ్డి చరిత్ర అని ప్రభాకర్ చౌదరి ధ్వజమెత్తారు. ఆయన పక్కన నిలబడి ఫొటో దిగేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. అనంతపురం మొత్తం మీద జేసీ వర్గం తప్ప ఒక్క ఎమ్మెల్యే కూడా గుర్నాథ్ రెడ్డికి మద్దతుగా లేరన్నారు. ఇన్నాళ్లూ తాము ఎవరితో పోరాటం సాగించామో వాళ్లనే పార్టీలో చేర్చుకుంటుంటే ఇక ఎవరితో పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.