2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?- లగడపాటి సమాధానం ఇదే..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరివారం కావడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటోన్నారు. భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం నాడు వేలాది మంది శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇవ్వాళ కూడా భక్తుల తాకిడి కొనసాగింది. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పట్టింది. క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

వీఐపీల సందడి..
సోమవారం నాడు 70,163 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,489 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. ఒక్కరోజులోనే హుండీ ఆదాయం అయిదు కోట్ల రూపాయలను దాటింది. 5 కోట్ల 22 లక్షల రూపాయలు శ్రీవారికి కానుకగా అందాయి.
ఇవ్వాళ పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి, శాసన సభ్యుడు జ్యోతుల చంటిబాబు, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తెలంగాణ మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఉన్నారు.

ఆంధ్రా ఆక్టోపస్..
ఆంధ్రా అక్టోపస్గా పేరున్న లగడపాటి రాజగోపాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా రోజుల తరువాత ఆయన మీడియా కంట పడ్డారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ తనదైన శైలిలో జోస్యం చెప్పడం ఆయన అలవాటు. ఎన్నికల ఫలితాలపై లగడపాటి చేయించిన సర్వే 99 శాతం ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉండటం వల్ల ఆయన వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఓటర్లు.

రాజకీయాలకు దూరంగా..
అత్యంత కీలకమైన విజయవాడ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు విజయం సాధించిన లగడపాటి రాష్ట్ర విభజన తరువాత ఆయన రాజకీయంగా తెరమరుగు అయ్యారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల మధ్య ఆయన తిరుమలలో మీడియా ముందుకు రావడం ఆసక్తి రేపింది. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఉత్కంఠతను కలిగించింది.

మీడియాతో చిట్చాట్..
స్వామివారి దర్శనాన్ని ముగించుకుని ఆలయ ప్రాంగణం నుంచి బయటికి వచ్చిన వెంటనే విలేకరులు లగడపాటిని చుట్టుముట్టారు. ఆయనను పలకరించారు. దీనితో ఆయన కొద్దిసేపు చిట్చాట్ చేశారు. రాజకీయాలపై మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదాయన. విజయవాడ నుంచి తన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చానని, ఈ ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నానని అన్నారు.

అందరూ బాగుండాలి..
స్వామివారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అకాంక్షిస్తున్నట్లు లగడపాటి చెప్పారు. అందరకీ మంచి ఆలోచనలు రావాలని ప్రార్థించానని వ్యాఖ్యానించారు. శ్రీవారి ఆశీర్వాదంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఇక్కడెందుకు? అని చిరునవ్వుతో బదులిచ్చారు.












Click it and Unblock the Notifications