విజయవాడ టీడీపీలో సడన్ ఛేంజ్: వల్లభనేని వంశీకి చెక్: గన్నవరం అభ్యర్థిగా లగడపాటి కొడుకు
విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేంద్రబిందువుగా పెను మార్పులు, ఈక్వేషన్లను సంభవించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఏ మాత్రం కొరుకుడు పడని గన్నవరం నియోజకవర్గంపై టీడీపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలను మొదలు పెట్టింది. టీడీపీకి ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రతిష్ఠాత్మకం కావడం వల్ల బలమైన నాయకుడి కోసం కొన్నాళ్లుగా చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్టే.

గన్నవరం..ప్రతిష్ఠాత్మకం
గన్నవరం.. విజయవాడ శివార్లలో ఉండే ఈ అసెంబ్లీ నియోజకవర్గం- రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు బలంగా ఉన్న స్థానం ఇది. మెజారిటీ ఓటుబ్యాంకు తెలుగుదేశం పార్టీ వైపే ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. వల్లభనేని వంశీ ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ విజయం సాధించిన స్థానాల్లో ఇదీ ఒకటి.

పార్టీ ఫిరాయింపుతో..
ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో- టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు విజయ ఢంకా మోగించిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశానికి గుడ్బై చెప్పారు. తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీలో అనధికారికంగా కొనసాగుతున్నారు. ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బయటికి వచ్చిన మొట్టమొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనే. వంశీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి టీడీపీ అగ్ర నాయకత్వానికి చాలాకాలమే పట్టింది.

దిద్దుబాటు చర్యలు..
2009 ఎన్నికలను కూడా కలుపుకొంటే వరుసగా మూడుసార్లు తమ పార్టీని గెలిపించిన ఈ నియోజకవర్గాన్ని చేతులారా పోగొట్టుకోవడానికి టీడీపీ ఏ మాత్రం సంసిద్ధంగా లేదు. అలాగనీ- వల్లభనేని వంశీని ఢీ కొట్టి, గెలవగలిగే అభ్యర్థిని వెదుక్కోనూ లేదు. గన్నవరంలో గెలుపు గుర్రం కోసం తెలుగుదేశం పార్టీ చేస్తోన్న అన్వేషణ ఫలించినట్టేనని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికే చెందిన బలమైన నాయకుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

లగడపాటి కుమారుడికి..
కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కుమారుడికి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇవ్వాలని టీడీపీ అగ్రనాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లగడపాటితోనూ సంప్రదింపులు, చర్చలు ముగిశాయని సమాచారం. తన కుమారుడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్గాలను అందుకోవడానికి లగడపాటి రాజగోపాల్ కొన్ని షరతులు పెట్టారని, దీనికి టీడీపీ అగ్రనాయకత్వం అంగీకరించిందనే ప్రచారం సాగుతోంది.

వల్లభనేని వంశీని ఢీ కొట్టగలరా?
లగడపాటికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి గన్నవరం టికెట్ ఇవ్వాలనే అభిప్రాయానికి టీడీపీ వచ్చిందని సమాచారం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లగడపాటి కుటుంబం ఒక్కటే- వల్లభనేని వంశీని ఢీ కొట్టగలదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ మార్జిన్ తక్కువే అయినప్పటికీ.. వైఎస్ఆర్సీపీ హవా బలంగా వీచిన సమయంలోనూ వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఇదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

వ్యక్తిగత ప్రతిష్ఠ..
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేయడం ఖాయం. గన్నవరం అసెంబ్లీ స్థానం పరిధిలో టీడీపీ అభ్యర్థిగా కంటే.. వల్లభనేని వంశీకి వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్ఠ, పట్టు వల్లే ఆయన గెలుపు సాధ్యపడిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. తాను గెలవగలిగేలా బలమైన ఓటుబ్యాంకును వంశీ సృష్టించుకున్నారనేది టాక్. టీడీపీని వ్యతిరేకించడానికి, ఆ పార్టీ నుంచి బయటికి రావడానికి ఆయన సాహసించారని చెబుతుంటారు. అలాంటి నాయకుడిని లగడపాటి కుటుంబం ఏ మేర ఎదురు నిలవగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications