వైసీపీలో లీకులు: మండలి కోసం కొత్త పేర్లు: కొత్తగా ఇద్దరు: టీడీపీ మాజీ ఎంపీకి ఛాన్స్?:
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసన మండలి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి రావట్లేదు. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల కోసం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంలో జాప్యం చేస్తోన్న కొద్దీ కొత్త పేర్లు తెర మీదికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన పేర్లలో ఏ ఒక్క దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఫలానా నేతలను శాసన మండలికి ఎంపిక చేయబోతున్నట్లు ధృవీకరించనూ లేదు.
అభ్యర్థుల పేర్లపై లీకులు..
దీనితో పలువురు సీనియర్ నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రోజూ కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు బలంగా వినిపించింది. ఆయనను శాసన మండలికి పంపించడం ఖాయమంటూ వైఎస్ఆర్సీపీ నుంచి లీకులు వెలువడ్డాయి. ఆయనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొయ్యె మోషేన్ రాజు పేరు వినిపించింది. కడప జిల్లా రాయచోటికి చెందిన ఓ మైనారిటీ నాయకుడిని ఎంపిక చేశారంటూ లీకులు వచ్చాయి.
టీడీపీ మాజీ ఎంపీకి..
తాజాగా వారిని కాదని మరో రెండు కొత్త పేర్లను బయటికి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. వారే- తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, కడప జిల్లాకు చెందిన మైనారిటీ నాయకురాలు జకియా ఖానుం. ఈ ఇద్దరినీ గవర్నర్ కోటా కింద శాసన మండలికి పంపించే అవకాశాలు ఉన్నాయంటూ కొత్తగా లీకులు వెలువడ్డాయి. ఎస్సీ నుంచి ఒకరిని, ముస్లిం-మహిళ నుంచి ఒకరిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చాలాకాలం పాటు కొనసాగారు.
రాజ్యసభకు కుదరకపోవడంతో మండలికి చాన్స్?
2014 నాటి ఎన్నికల్లో ఆయన అమలాపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. అప్పటికే వైసీపీ తరఫున అమలాపురం లోక్సభ అభ్యర్థి పేరు ఖాయం చేయడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. రాజ్యసభకు ఎంపిక చేస్తామంటూ అప్పట్లో వైసీపీ నేతలు హామీ ఇచ్చారని అంటున్నారు. శాసన మండలి రద్దు తెరమీదికి రావడం.. అనూహ్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పేర్లను ఖరారు చేయడంతో రవీంద్రబాబుకు ఆ అవకాశం రాలేదు.
మైనారిటీ నుంచి మహిళకు అవకాశం..
ఫలితంగా- ఆయనను శాసన మండలికి ఎంపిక చేయవచ్చని అంటున్నారు. మైనారిటీ కోటాలో జకియా ఖానుం పేరు వినిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం కుటుంబానికి పెద్దగా రాజకీయ నేపథ్యంలో లేదని అంటున్నారు. ఆమె, ఆమె భర్త రాజకీయాల్లో వైఎస్ కుటుంబం వెంటే ఉంటోందని అంటున్నారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని జకియా ఖానుం పేరును ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ రెండు పేర్లనూ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.