జగన్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ, అమర్నాథరెడ్డి అనుచరుడు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు చేరారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నేతలు చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ గడ్డం శ్రీనివాసరావు , వేటపాలెం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కర్ణ శ్రీనివాసరావు వైసీపీ కండువా కప్పుకున్నారు.
వీరితోపాటు ప్రకాశం జిల్లా యానాది సంఘం అధ్యక్షుడు వేటగిరి సంజీవరావు, మాజీ సర్పంచ్ బొచ్చుల మోహన్ రావు వైసీపీలో చేరారు. వీరందరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల సమన్వయకర్త వరికూటి అమృతపాణి, చీరాల పార్టీ అధ్యక్షుడు బొనిగల జైసన్ బాబు, రూరల్ అధ్యక్షుడు పిన్నిబోయిన రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇది ఇలావుంటే.. పలమనేరుకు చెందిన నాయకుడు ఆకుల గజేంద్ర గురువారం వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి.. గజేంద్రకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గజేంద్ర ఒకప్పుడు మంత్రి ఎన్ అమర్నాథరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు.
తాను ఊపిరున్నంతవరకు జగన్ వెంటే ఉంటానని గజేంద్ర ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా కృషి యాలని ఈ సందర్భంగా జగన్ ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రాకేష్ రెడ్డి, సీవీ కుమార్ పాల్గొన్నారు.