జరగని ప్రకృతి వ్యవసాయం కోసం అన్ని కోట్ల ఒప్పందమా?...ఎపి పరువు పోతోంది: ఉండవల్లి
Recommended Video
రాజమండ్రి:ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దుయ్యబట్టారు.
మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సిఎం చంద్రబాబు యూఎన్ఓలో ప్రసంగించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో ఎందుకు పెట్టలేదని ఉండవల్లి ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు జరగని ప్రకృతి వ్యవసాయం కోసం రూ.16 వేల 600 కోట్ల ఒప్పందమా?...అని నిలదీశారు. జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు.
దానికోసం...అంతపెద్ద డీలా?...
జీరో బడ్జెట్ పేరిట నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్ సంస్థతో ఎందుకు చేసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కుటుంబరావు నంబర్ 2 గా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించాలని కోరారు.
శ్వేతపత్రం...ప్రకటించండి
ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు. దేశం మొత్తం మీద వచ్చిన పెట్లుబడుల్లో 20 శాతం మనకే వచ్చిందని,18 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు వచ్చాయని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. వచ్చిన పెట్టుబడులపై టిడిపి ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని, ఇప్పటికైనా యదార్థాలు మాట్లాడాలని ఉండవల్లి కోరారు.
పోలవరంపై...వాళ్లే నవ్వుతున్నారు
2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని టీడీపీ నేతలు చెబుతుంటే...ఇంజనీర్లే నవ్వుకుంటున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల జనాన్ని పోలవరం ప్రాజెక్టు చూపించటానికి తీసుకు వెళ్లినందుకు 20 కోట్ల రూపాయల వ్యయం చేయటం దారుణమన్నారు.
రామోజీ...శిక్షలకు అతీతుడా?
రామోజీ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం గురించి 2005లో రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి తన ఆత్మకథలో రాసుకున్నారని ఉండవల్లి తెలిపారు. రామోజీరావు శిక్షలకు అతీతుడు అనే పద్ధతిలో అందరూ వ్యవహరించడం దారుణమని ఉండవల్లి వ్యాఖ్యానించారు.