తమ్మినేని సీతారాంకు బిగుస్తున్న ఉచ్చు - అర్ద్రరాత్రి పరారీ..!!
మాజీ స్పీకర్.. వైసీపీ నేత తమ్మినేని సీతారాం కు ఉచ్చు బిగుస్తోంది. భూ కబ్జా కేసులో తమ్మినేని తో సహా కుటుంబ సభ్యుల పైన కేసుల నమోదు అయింది. విచారణ అధికారులు పూర్తి ఆధారాలను సేకరించారు. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమదాలవలసలోని తమ అద్దె ఇల్లు వదిలి రహస్యంగా పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిక్కుల్లో పడ్డారు. భూ కబ్జా కేసులో కుటుంబ సభ్యులతో సహా ఆయన పైన కేసు నమోదైంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు రూ. 4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ ఖాయం కావటంతో.. తమ్మినేని తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంట్లో రెండు సొంత కార్లు ఉన్నా.. అనుమానం రాకుండా ప్రైవేటు ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లినట్లు చెబుతున్నారు.

పోలీసులు తమ లొకేషన్ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. చాపురం పంచాయతీ బలగ పరిధిలో ఉన్న భూ యజమాని బతికుండగానే, ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారనే అభియోగం నమొదైంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి, ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు.
తమ్మినేని కోసం పోలీసుల గాలింపు
ఈ వ్వవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో భాగమైన 13 మంది నిందితుల్లో హిరమండలం సబ్రిజిస్ట్రార్ సహా 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో పదుల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేల్చారు. వైసీపీ హయాంలో స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు తమ్మినేని కొనుగోలు చేసిన భూముల్లో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇంకేమైనా ఇలాంటి అక్రమాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది.
తమ్మినేనిపై గతంలోనూ పలు భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆమదాలవలస టీఎస్ఆర్ కళాశాల పక్కన ఉన్న 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించగా, ఇటీవల అధికారులు బాధితులకు అప్పగించారు. ఓ కానిస్టేబుల్ భార్యను బెదిరించి రైల్వేస్టేషన్ సమీపంలోని ఇల్లును తమ్మినేని కుటుంబం ఆక్రమించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా.. తమ్మినేని తో సహా కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేసారు.












Click it and Unblock the Notifications